అనంతపురం జిల్లా తాడిపత్రిలో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ నేత జేసీ ప్రభాకర్రెడ్డి అనుచరుల దాడికి నిరసనగా గాంధీ సెంటర్ వద్ద శాంతియుత ఆందోళన చేపట్టాలని వైసీపీ పిలుపునివ్వగా, ఆందోళనకు బయలుదేరిన పార్టీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడం వివాదాస్పదంగా మారింది.
వైసీపీ శ్రేణులు శాంతియుత నిరసనకు సిద్ధమవుతుండగానే భారీగా పోలీసులు మోహరించి వారిని ముందుకు వెళ్లనీయకపోవడం స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. అధికార తెలుగుదేశం పార్టీ నేతలు వైసీపీ ఆందోళనలకు వ్యతిరేకంగా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
తాడిపత్రి భగత్సింగ్ నగర్లోని తన నివాసం వద్ద మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. తాడిపత్రిలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, రాజకీయ ప్రత్యర్థుల గొంతు నొక్కే ప్రయత్నాలను నిలువరించాలని ఆయన డిమాండ్ చేశారు. “తాడిపత్రిలో రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తోంది. వైసీపీ నాయకులు, కార్యకర్తల రక్తంతో రెడ్బుక్ తడిసిపోయింది” అంటూ కేతిరెడ్డి పెద్దారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. పోలీసులు ప్రజలకు రక్షణ కల్పించాల్సింది పోయి అధికార పార్టీకి తొత్తులుగా మారారంటూ మండిపడ్డారు.
ఇటీవల వైసీపీ నాయకుడు కేశవరెడ్డిపై పోలీసులు కళ్ల ముందే దాడి జరిగినప్పటికీ చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. “తాడిపత్రిలో పోలీసులు ఉన్నా ప్రయోజనం లేకుండా పోయింది. చట్టవ్యవస్థ పూర్తిగా అధికార పార్టీ ఒత్తిళ్లకు లోనవుతోంది” అని ఆయన విమర్శించారు. మరోవైపు, పెద్దారెడ్డి నివాసానికి చేరుకునేందుకు ప్రయత్నించిన వైసీపీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు నాలుగు వైపులా అడ్డుకోవడంతో ఉద్రిక్తత మరింత పెరిగింది.
తాడిపత్రికి బయలుదేరిన అనంతపురం జిల్లా వైసీపీ అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డిలను కూడా అనంతపురం జిల్లా పార్టీ కార్యాలయం వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యేలు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తాడిపత్రి ఘటన మరోసారి రాష్ట్రంలో పోలీసు వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలను అడ్డుకోవడమే కాకుండా అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలపై ప్రభుత్వం, పోలీసు శాఖ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.








