శ్రీకాకుళం జిల్లాలో(Srikakulam District) వైఎస్ జగన్ (YS Jagan) పర్యటన విజయవంతంగా ముగిసింది. జైలులో ఉన్న మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును(Seediri Appalaraju) పరామర్శించేందుకు వెళ్లినా.. అభిమానుల తాకిడితో జగన్ అనుకున్న సమయానికి జైలు వద్దకు వెళ్లలేకపోయిన విషయం తెలిసిందే. జనం సందడితో 110 కిలోమీటర్ల జగన్ ప్రయాణం 7.30 గంటల పాటు సాగింది.
జగన్ పర్యటనలో వైసీపీ శ్రేణులు పాల్గొనకుండా 5000 మంది పోలీసులను జిల్లా వ్యాప్తంగా మోహరింపజేశారని వైసీపీ కార్యకర్తలే మీడియా ముందు చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆమదాలవలస వద్ద జరిగిన ఓ ఘటనను టీడీపీ(TDP) మీడియా తెగ ప్రసారం చేసింది. దూరం నుంచి తీసిన ఆ వీడియోలో వైసీపీ నేత చింతాడ రవి(Chintada Ravi), అతని అనుచరులు మహిళా ఎస్ఐని వేదించారని కథనం ప్రసారం చేసింది. ఇవాళ అతనిపై కేసు నమోదైంది.
జగన్ సభ విజయవంతం కావడాన్ని డైల్యూట్ చేయాలనే ఉద్దేశంతోనే తనపై కేసులు పెట్టారని ఆమదాలవలస వైసీపీ ఇన్చార్జ్ రవికుమార్(Ravikumar) అన్నారు. ఈ మేరకు ఆయన ఒక వీడియోను విడుదల చేసి.. ఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. మహిళా ఎస్సైపై తాను ఎలాంటి దాడి చేయలేదని, ఆమె అస్వస్థతకు గురికావడంతో క్షేమం కోసమే పక్కకు తీసుకెళ్లామని చెప్పారు.
జగన్ పర్యటన సందర్భంగా “జై జగన్”(Jai Jagan) నినాదాల శబ్దానికి మహిళా ఎస్సై చెవులు మూసుకున్నారని, ఆ దృశ్యాన్నే దాడిగా చిత్రీకరించి తప్పుడు ప్రచారం చేశారని ఆరోపించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వీడియోలను విడుదల చేస్తే అసలు నిజాలు ప్రజలకు తెలుస్తాయని అన్నారు. జరగని ఘటనకు హత్యాయత్నం వంటి తీవ్రమైన కేసులు ఎలా నమోదు చేస్తారని ప్రశ్నించిన రవికుమార్, ప్రభుత్వం అనుకూల మీడియా వాస్తవాలను వక్రీకరించి ప్రచారం చేసిందని ఆరోపించారు.
ఈ ఘటనపై నలుగురు మంత్రులతో మాట్లాడించి వివాదాన్ని మరింత పెంచారని విమర్శించారు. పోలీసు శాఖను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నారని ఆరోపించిన ఆయన, తమపై ఎన్ని కేసులు పెట్టినా వైఎస్ జగన్ కోసం చేసే పోరాటం ఆగదని, అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదని చింతాడ రవికుమార్ స్పష్టం చేశారు.








