‘చిన్నోడు.. పెద్దోడు’.. టీడీపీ మీడియాపై అంబటి సెటైర్లు

'చిన్నోడు.. పెద్దోడు'.. టీడీపీ మీడియాపై అంబటి సెటైర్లు

Summarize with AI

ముంబై నటి కాదంబరి జెత్వానీ కేసులో ఏపీ సీఐడీ కోర్టుకు సమర్పించిన చార్జ్‌షీట్ తర్వాత రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోయాయి. మొదట్లో ఈ కేసును వైసీపీ ప్రభుత్వానికి అంట‌గ‌డుతూ ప్ర‌చారం జ‌రిగిన‌ప్ప‌టికీ, రెండేళ్ల త‌రువాత సీఐడీ నివేదిక‌తో సీన్ మారిపోయింది.

సీఐడీ దాఖలు చేసిన తాజా చార్జ్‌షీట్‌లో జెత్వానీనే బ్లాక్‌మెయిలింగ్ చేసి కుక్కల విద్యాసాగర్ నుంచి రూ. 1.32 కోట్లు వసూలు చేసినట్లు పేర్కొనడంతో కథ అడ్డం తిరిగింది. ఈ పరిణామాల నేపథ్యంతో గ‌తంలో త‌మ పార్టీపై ఇన్నాళ్లూ చేసిన ప్ర‌చారాన్ని అంబ‌టి తిప్పికొట్టారు. జెత్వానీ కేసులో టీడీపీ అనుకూల మీడియా ప్రసారాల చేసిన వీడియోల‌ను ప్ర‌ద‌ర్శించి వారి క్రెడిబిలిటీని ప్ర‌శ్నార్థ‌కంలో ప‌డేశారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో ఈ కేసును తామే తెరపైకి తెచ్చామని, విచారణ జరిపించామని క్రెడిట్ తీసుకోవడానికి ఏబీఎన్ ప్రతినిధి (చిన్నోడు) వెంకటకృష్ణ, టీవీ5 ప్రతినిధి (పెద్దోడు) మూర్తి పోటీపడ్డారని అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. జెత్వానీని ముంబై నుంచి విజయవాడకు కిడ్నాప్ చేసి తీసుకొచ్చి చిత్రహింసలకు గురిచేశారంటూ టీడీపీ మీడియాలో చూపించిన కథనాలన్నీ బోగస్ అని, సీఐడీ చార్జ్‌షీట్‌తో ఆ కట్టుకథలన్నీ తేలిపోయాయని ఆయన ఘాటుగా విమర్శించారు.

పరీక్షలు రాసి, టాప్ ర్యాంకులు సాధించి వ్యవస్థకు సేవ చేయడానికి వచ్చే సిన్సియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బలిపశువులను చేశారని అంబటి ఆవేదన వ్యక్తం చేశారు. “మాజీ గుంటూరు ఎస్పీ, విజయవాడ కమిషనర్ పి.ఎస్.ఆర్. ఆంజనేయులు వంటి సిన్సియర్ ఆఫీసర్ పేరు వింటే నేరస్థులు గడగడలాడేవారు. అలాంటి సీనియర్ ఐపీఎస్ అధికారులు, ఏసీపీ హనుమంతరావు, ఇబ్రహీంపట్నం సీఐలను అక్రమంగా సస్పెండ్ చేసి జైలుకు పంపారు. నా 70 ఏళ్ల జీవితంలో పోలీసులను వాడుకుని, వారిపైనే కేసులు పెట్టి అరెస్ట్ చేయించిన ఇలాంటి దుర్మార్గమైన రాక్షస రాజకీయాన్ని నేనెప్పుడూ చూడలేదు” అన్నారు అంబటి రాంబాబు.

సీఐడీ దర్యాప్తులో నటి కాదంబరి జెత్వానీ ఫోన్ కాల్స్, ఎస్‌ఎమ్‌ఎస్‌లు, బ్యాంక్ లావాదేవీల ఆధారంగా ఆమె బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడినట్లు నిర్ధారణ అయింది. దీంతో ఎలాంటి ఆధారాలు లేకుండా ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేయడం, అరెస్ట్ చేయడం కేవలం రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగమేనని స్ప‌ష్టంగా అర్థ‌మ‌వుతోందని వైసీపీ ఆరోపిస్తోంది.

మొదట్లో గొప్పగా ప్రచారం చేసుకుని, ఇప్పుడు సీఐడీ చార్జ్‌షీట్‌తో డిఫెన్స్‌లో పడిన కూటమి ప్రభుత్వం, సదరు టీడీపీ మీడియా ఛానెళ్లు దీనిపై ఇప్పుడు మ‌రో కొత్త రాగాన్ని అందుకున్నాయ‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. మొద‌ట్లో అంతా తామే అని హంగామా చేసిన ఛాన‌ల్స్‌.. సీఐడీ చార్జ్‌షీట్ త‌రువాత‌ ఈ మొత్తం వ్య‌వ‌హారాన్ని ప్ర‌భుత్వానికి అంట‌గ‌ట్టే ప్ర‌య‌త్నం చేస్తోంద‌ని సోష‌ల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment