ఆంధ్రప్రదేశ్లో నిర్వహించిన మెగా డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వైసీపీ పార్లమెంట్ వేదికగా పోరాటానికి దిగింది. మెగా డీఎస్సీ వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతూ లోక్సభ, రాజ్యసభ ఉభయ సభల్లో పార్టీ ఎంపీలు వాయిదా తీర్మాన నోటీసులు ఇచ్చారు.
రాజ్యసభలో వైసీపీ ఎంపీ వీవీ సుబ్బారెడ్డి వాయిదా తీర్మాన నోటీసు ఇవ్వగా, లోక్సభలో పార్టీ ఎంపీ గురుమూర్తి ఇదే అంశంపై వాయిదా తీర్మానం కోరారు.
రాష్ట్రంలో 16 వేల మంది ఉపాధ్యాయుల నియామకాల ప్రక్రియలో భారీ అవకతవకలు చోటుచేసుకున్నాయని వైసీపీ ఉద్యమాన్ని ఉధృతం చేస్తోంది. అవకతవకలకు సంబంధించిన ఆధారాలను సైతం వైసీపీ బయటపెట్టింది. వైసీపీ వాదనలకు బలం చేకూర్చేలా డీఎస్సీ అభ్యర్థులు గళం వినిపిస్తున్నారు. నియామక ప్రక్రియను అవుట్సోర్సింగ్ ఉద్యోగులతో నిర్వహించడం వల్ల పారదర్శకత దెబ్బతిందని వైసీపీ పేర్కొంది.
అలాగే, స్పోర్ట్స్ కోటా పేరుతో డబ్బులు తీసుకుని ఉద్యోగాలు కేటాయించారని, అర్హులైన అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపించింది. జిల్లాల వారీగా మెరిట్ జాబితాలను విడుదల చేయలేదని, సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తిచేసుకున్న పలువురు అభ్యర్థులను కూడా ఎంపిక చేయలేదని విమర్శించింది.
ఈ నేపథ్యంలో మెగా డీఎస్సీ నియామకాలపై సమగ్ర దర్యాప్తు జరిపేందుకు సీబీఐ విచారణకు ఆదేశాలు ఇవ్వాలని వైసీపీ పార్లమెంట్ వేదికగా డిమాండ్ చేస్తోంది. ఈ అంశంపై ఉభయ సభల్లో చర్చ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరింది.








