నమీబియా(Namibia) వేదికగా జరిగిన ముక్కోణపు టీ20 సిరీస్ను (Tri-Series T20 Series) సౌతాఫ్రికా (South Africa) కైవసం చేసుకుంది. ఆదివారం విండ్హోక్లో(Windhoek) జరిగిన ఫైనల్లో జింబాబ్వేపై(Zimbabwe) 48 పరుగుల తేడాతో విజయం సాధించి ట్రోఫీని సొంతం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 205 పరుగుల భారీ స్కోరు సాధించగా.. 206 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే 157 పరుగులకే ఆలౌటైంది. ఒక దశలో 67 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా సాగిన జింబాబ్వేను ఆల్రౌండర్ బ్రాడ్ ఎవాన్స్(Brad Evans) ఒంటరి పోరాటంతో ఆదుకునే ప్రయత్నం చేశాడు. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన ఎవాన్స్ సఫారీ బౌలర్లపై ఎదురుదాడికి దిగుతూ 31 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 56 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అయితే అతడి పోరాటం జట్టును గెలిపించలేకపోయింది.
ఈ అర్ధసెంచరీతో బ్రాడ్ ఎవాన్స్ అరుదైన రికార్డును కూడా నమోదు చేశాడు. టీ20 సిరీస్ లేదా టోర్నమెంట్ ఫైనల్లో ఆరో స్థానంలో లేదా అంతకంటే దిగువన బ్యాటింగ్కు వచ్చి హాఫ్ సెంచరీ చేసిన తొలి ఐసీసీ ఫుల్ మెంబర్ దేశ ఆటగాడిగా నిలిచాడు. ఇప్పటివరకు టెస్టు హోదా కలిగిన ఏ జట్టు ఆటగాడూ ఫైనల్లో ఈ ఘనత సాధించలేదు. అయితే ఓవరాల్గా ఫైనల్లో ఆరో స్థానం లేదా అంతకంటే దిగువన బ్యాటింగ్ చేసి అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన రికార్డు నేపాల్ ఆటగాడు బసీర్ అహ్మద్ పేరిట ఉంది. క్వాడ్రాంగులర్ టీ20 సిరీస్ ఫైనల్లో కువైట్పై నేపాల్ తరఫున బసీర్ అహ్మద్ 80 పరుగులు చేశాడు. మొత్తంగా సౌతాఫ్రికా సమష్టి ప్రదర్శనతో ట్రై సిరీస్ టైటిల్ను అందుకోగా.. ఫైనల్లో ఓడినప్పటికీ బ్రాడ్ ఎవాన్స్ పోరాటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.








