ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల స్వప్నమైన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం (అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం) ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా జాతికి అంకితం కానున్న ఈ శుభతరుణంలో, ఆంధ్రప్రదేశ్లో వైసీపీ, టీడీపీల మధ్య “క్రెడిట్ వార్” తీవ్ర రూపం దాల్చింది. తామంటే తామే అత్యధిక అనుమతులు తెచ్చి, భూసేకరణ పూర్తి చేసి, పనులు వేగవంతం చేశామని ఇరు పార్టీల నేతలు, సోషల్ మీడియా విభాగాల మధ్య వాడీవేడి చర్చ నడుస్తోంది.
ఈ నేపథ్యంలో భోగాపురం విమానాశ్రయం శంకుస్థాపన రోజున జీఎంఆర్ గ్రూప్ అధినేత గ్రంధి మల్లికార్జునరావు సభా వేదికపై నుండి చేసిన వ్యాఖ్యలను నెటిజన్లు రీ-షేర్ చేస్తున్నారు. “గతంలో హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయానికి ఫౌండేషన్, ప్రారంభోత్సవం దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి సమక్షంలో.. నేడు భోగాపురం ఎయిర్పోర్టుకు ఆయన తనయుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో ఫౌండేషన్ వేయడం భగవంతుడి నిర్ణయం” అని ఆయన చెప్పిన మాటల వీడియో వైరల్ అవుతోంది.
టీడీపీకి ఇరకాటంగా ‘కుప్పం’ లాజిక్
తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ అనుకూల మీడియా భోగాపురం ప్రాజెక్టు క్రెడిట్ తమదేనని ప్రచారం చేస్తున్న వేళ, నెటిజన్లు ఒక లాజికల్ క్వశ్చన్తో ఆ పార్టీని ప్రశ్నిస్తున్నారు. 2019 జనవరి 3న చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో విమానాశ్రయానికి శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన జరిగి ఏళ్లు గడుస్తున్నా, కుప్పం విమానాశ్రయ ప్రాజెక్టులో ఎలాంటి పురోగతి లేదు.
సొంత నియోజకవర్గంలో భూమి పూజ చేసిన ప్రాజెక్టునే పూర్తి చేయలేకపోయినప్పుడు, భోగాపురం క్రెడిట్ మొత్తం తమదే అని చెప్పుకోవడంలో ఏమైనా లాజిక్ ఉందా అని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. అనుమతులు సాధించడం, రైతులకు పరిహారం చెల్లించి భూసేకరణ పూర్తి చేయడం, ఆ భూమిని జీఎంఆర్ (GMR) సంస్థకు అప్పగించడం వంటి కీలక ఘట్టాలన్నీ వైసీపీ ప్రభుత్వ హయాంలోనే జరిగాయని ఆధారాలు గూగుల్లో సైతం స్పష్టం చేస్తున్నాయంటున్నారు.
భోగాపురం ఎయిర్పోర్టు కోసం ముఖ్యమైన అనుమతులు తెచ్చి, నిధులు కేటాయించి, భూసేకరణ పూర్తిచేసి 2026 నాటికి ఎయిర్పోర్టును అందుబాటులోకి తెచ్చేలా కచ్చితమైన టైమ్లైన్ నిర్దేశించి పనులు నడిపింది వైఎస్ జగన్ ప్రభుత్వమేనని గణాంకాలు చెప్తున్నాయంటున్నారు. మరి శంకుస్థాపనల వరకే పరిమితమై కుప్పం ఎయిర్పోర్టును వదిలేసిన టీడీపీ నేతలు, భోగాపురం క్రెడిట్ తమదంటూ చేస్తున్న ప్రచారానికి ఏం సమాధానం చెప్తారో వేచి చూడాల్సిందే.
| తేదీ | జగన్ హయంలో చేసిన పనులు.. గూగుల్ డేటా |
| 12 జూన్ 2020 | జీఎంఆర్ (GMR) సంస్థతో కన్సెషన్ అగ్రిమెంట్ పూర్తి. |
| 11 నవంబరు 2020 | కేంద్ర పౌర విమానయాన శాఖ నుంచి సైట్ క్లియరెన్స్ / ఇన్-ప్రిన్సిపల్ అప్రూవల్. |
| 13 సెప్టెంబరు 2022 | విశాఖ నేవల్ ఎయిర్బేస్లోని సివిల్ ఎన్క్లేవ్ మూసివేతకు కేంద్ర NOC సాధన. |
| 23 ఫిబ్రవరి 2023 | ఎయిర్పోర్టుకు రోజుకు 5 మిలియన్ లీటర్ల నీటి సరఫరాకు జీవో జారీ. |
| 23 ఫిబ్రవరి 2023 | ఎయిర్పోర్టు బౌండరీ వరకు విద్యుత్ సరఫరాకు ఉత్తర్వులు. |
| 6 ఏప్రిల్ 2023 | BCASతో సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ ఒప్పందం. |
| 3 మే 2023 | వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా నిర్మాణ భూమిపూజ. |
| 16 మే 2023 | ఏరోనాటికల్ సేవల మద్దతుకు కేంద్రం–GVIAL మధ్య MOU. |
| 31 అక్టోబరు 2023 | 2,203.26 ఎకరాల స్పష్టమైన భూమిని జీఎంఆర్కు అప్పగింత. |








