ఆంధ్రప్రదేశ్లో (Andhra Pradesh)పెట్టుబడులు(Investments), ఉద్యోగ కల్పనపై (Employment Generation) ప్రభుత్వం చెబుతున్న లెక్కలకీ, క్షేత్రస్థాయి పరిస్థితులకు తేడా ఉందనే చర్చ మొదలైంది. కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ పార్లమెంటులో వెల్లడించిన తాజా ‘పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే’ (Periodic Labour Force Survey – PLFS) వివరాల ప్రకారం రాష్ట్రంలో నిరుద్యోగిత రేటు తగ్గకపోగా, కొన్ని విభాగాల్లో మరింత పెరిగినట్లు స్పష్టమవుతోంది.
కేంద్ర ప్రభుత్వం (Central Government) వెల్లడించిన తాజా నివేదిక ప్రకారం.. ఏపీలో (AP) 2023–24 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో నిరుద్యోగిత రేటు (Unemployment Rate) 4.1 శాతంగా ఉండగా, తాజా నివేదిక నాటికి అది 4.2 శాతానికి పెరిగింది. పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగిత రేటు 5.9 శాతం నుండి 6.2 శాతానికి పెరిగి ఆందోళనకరంగా మారింది. గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగిత రేటులో ఎలాంటి మార్పు లేకుండా 3.4 శాతం వద్ద యథాతథంగా కొనసాగింది. 15 నుండి 29 సంవత్సరాల వయస్సు కలిగిన యువతలో నిరుద్యోగిత రేటు ఏకంగా 16.2 శాతంగా నమోదైంది.
ఉపాధి కల్పన, నైపుణ్యాభివృద్ధి, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (MSME) ప్రోత్సాహం, స్వయం ఉపాధి మరియు అప్రెంటిస్షిప్ల (Apprenticeships) కోసం కేంద్ర ప్రభుత్వం పలు పథకాలను అమలు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. అయితే, ఆయా పథకాలను సమర్థంగా వినియోగించుకోవడంలోనూ, రాష్ట్ర యువతకు తగిన రీతిలో ఉపాధి అవకాశాలు అందించడంలోనూ అనుకున్న స్థాయిలో పురోగతి కనిపించడం లేదని ఈ డేటా సూచిస్తోంది.
ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వం(Chandrababu Naidu Government) చేసుకుంటున్న అధికారిక ప్రచారాలకు, వాస్తవ గణాంకాలకు పొంతన ఉండటం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గడిచిన రెండేళ్లలో రాష్ట్రంలో కొత్తగా ఎన్ని పరిశ్రమలు ప్రారంభమయ్యాయి? వాటి ద్వారా సాధించిన శాశ్వత ఉద్యోగాల సంఖ్య ఎంత? ఎంతమంది స్థానిక యువతకు ఉపాధి లభించింది? అనే వివరాలపై ప్రభుత్వం స్పష్టమైన డేటాను ప్రజల ముందు ఉంచాల్సిన అవసరం ఉందని పలువురు కోరుతున్నారు.








