ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం విడుదల చేసిన రెండేళ్ల ప్రగతి నివేదికను ఆమె తీవ్రంగా తప్పుబడుతూ, అది ప్రగతి నివేదిక కాదని.. “గతి తప్పిన నివేదిక” అని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆమె అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతా నుంచి సుదీర్ఘమైన ట్వీట్ చేశారు.
షర్మిల మాట్లాడుతూ.. అబద్ధాన్ని అందంగా చెప్పడంలో చంద్రబాబు దిట్ట అని విమర్శించారు. కూటమి ప్రభుత్వం చెబుతున్న నాలుగు సూత్రాల పాలన పూర్తిగా అపహాస్యంగా మారిందన్నారు. అభివృద్ధి బూటకమని, సంపద సృష్టి మోసమని, సమతుల్య అభివృద్ధి పచ్చి అబద్ధమని, సంక్షేమం పేరుతో ప్రజలను మోసం చేశారని ఆరోపించారు.
ఎన్నికల సమయంలో ప్రకటించిన “సూపర్ సిక్స్” హామీలు అమలుకాలేదని షర్మిల అన్నారు. మూడు వేల రూపాయల నిరుద్యోగ భృతి లేదా 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి లక్షలాది మంది నిరుద్యోగులను నిరాశపరిచారని విమర్శించారు. 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1,500 ఇస్తామని చెప్పి ఆ హామీని అమలు చేయలేదన్నారు.
‘తల్లికి వందనం’ పథకంలో ఇంట్లో ఉన్న ప్రతి విద్యార్థికి సాయం అందిస్తామని హామీ ఇచ్చి, అమలులో మాత్రం అర్హుల సంఖ్యను పరిమితం చేశారని ఆరోపించారు. రైతులకు రూ.20 వేల ఆర్థిక సాయం అందిస్తామని చెప్పి, కేంద్ర ప్రభుత్వ పీఎం కిసాన్ పథకంతో అనుసంధానం చేసి మాట మార్చారని విమర్శించారు.
ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి పథకాల కింద వేల కోట్ల రూపాయల బకాయిలు పేరుకుపోయాయని షర్మిల పేర్కొన్నారు. విద్యుత్ చార్జీల విషయంలో ఒకవైపు సబ్సిడీలు ఇచ్చామని చెబుతూనే, మరోవైపు ట్రూ-అప్ ఛార్జీల రూపంలో ప్రజలపై భారం మోపారని ఆరోపించారు.
రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వచ్చాయని ప్రభుత్వం ప్రచారం చేస్తోందని, కానీ వాస్తవంగా అభివృద్ధి కనిపించడం లేదని షర్మిల అన్నారు. అమరావతి పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారని, అభివృద్ధి కంటే అప్పులే పెరిగాయని ఆరోపించారు. రెండేళ్ల కూటమి పాలనను “24 మోసాల మయం”గా అభివర్ణించిన షర్మిల.. ఎన్నికల హామీలు, సంక్షేమ పథకాల అమలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.








బాబు పాలనలో గంజాయి పంటకే గిట్టుబాటు ధర