ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గంజాయి గురించి చెప్పాల్సిన పనిలేదు. మొన్న ఏకంగా స్కూల్లో కూర్చొని కొందరు యువకులు గంజాయి కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే గంజాయిని నిర్మూలిస్తామని సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఎన్నికల వేళ ప్రకటించుకున్నారు. రెండేళ్లు అయినా ఆ వాగ్దానం సాధ్యపడలేదు.
ఇదిలా ఉంటే చంద్రబాబు పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేవు కానీ, వెన్నుపోటు పార్టీ (టీడీపీ) వాళ్లు పండించే ఒక్క గంజాయి పంటకు మాత్రమే గిట్టుబాటు ధర ఉందంటూ దేవరపల్లి సభలో వైఎస్ జగన్ సంచలన కామెంట్స్ చేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్ తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో పొగాకు రైతులతో సమావేశమై వారి సమస్యలను తెలుసుకున్నారు.
జగన్ మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు పాలనలో ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదని, గిట్టుబాటు ధర ఉన్నది ఒక్క “గంజాయి పంటకే” అని విమర్శించారు. “ఆ పంట సాగు చేసేవారు కూడా వెన్నుపోటు పార్టీ (టీడీపీ) వారే” అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో 67 శాతం మంది వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నప్పటికీ, గత 26 నెలలుగా వరి, మొక్కజొన్న, అరటి, కొబ్బరి, పత్తి, పెసర్లు, మిర్చి, పొగాకు, టమోటా, మామిడి వంటి పంటలకు గిట్టుబాటు ధర లభించలేదన్నారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో 2023–24లో రాష్ట్రవ్యాప్తంగా పొగాకు సగటు ధర కిలోకు రూ.289 ఉండగా, గరిష్ఠంగా రూ.411 వరకు ధర పలికిందని జగన్ పేర్కొన్నారు. ఈ గణాంకాలు కేంద్ర ప్రభుత్వానికి చెందిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) విడుదల చేసిన అధికారిక వివరాలేనని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో పొగాకు సగటు ధర కిలోకు కేవలం రూ.214 మాత్రమే ఉందని, అంటే రైతు ప్రతి కిలోపై సుమారు రూ.75 నష్టపోతున్నాడని తెలిపారు. ఉత్తరాంధ్రలోని దేవరపల్లి ప్రాంతంలో గతంలో కిలోకు రూ.326 సగటు ధర లభించగా, ప్రస్తుతం అది రూ.236కు పడిపోయిందని పేర్కొన్నారు.
తాను దేవరపల్లి పర్యటనకు వస్తున్నట్లు ప్రకటించిన తర్వాతే గత వారం రోజులుగా కిలోకు సుమారు రూ.10 ధర పెరిగిందని జగన్ వ్యాఖ్యానించారు. తాను రాకపోయి ఉంటే ఆ పెంపు కూడా జరిగేది కాదన్నారు. ప్రస్తుతం అత్యధిక ధర రూ.260–262 మధ్య ఉండగా, సగటు ధర రూ.174 వరకు పడిపోయిందని చెప్పారు. ఇలాంటి ధరలతో రైతులు ఎలా బతుకుతారని చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
పొగాకు కొనుగోళ్లలో దళారుల సిండికేట్ పనిచేస్తోందని రైతులు చెబుతున్నారని జగన్ పేర్కొన్నారు. వేలాల్లో “నో బిడ్స్” పేరుతో పంట కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. 30 నుంచి 40 శాతం వరకు పొగాకును తిరస్కరిస్తున్నప్పటికీ ప్రభుత్వం ఒక్క కొనుగోలుదారునిపై కూడా చర్యలు తీసుకోలేదని విమర్శించారు.
రైతులకు భరోసా కల్పించేలా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడం లేదని, వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని జగన్ ఆరోపించారు. పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించి, దళారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.








అబద్ధాన్ని అందంగా చెప్పడంలో చంద్రబాబు దిట్ట