మాతా-శిశు ఆరోగ్యంలో తెలంగాణ సత్తా.. రూ.200 కోట్లతో కేంద్రం ప్రోత్సాహం

మాతా-శిశు ఆరోగ్యంలో తెలంగాణ సత్తా.. రూ.200 కోట్లతో కేంద్రం ప్రోత్సాహం

Summarize with AI

మాతా-శిశు ఆరోగ్య సంరక్షణలో తెలంగాణ మరో కీలక మైలురాయిని చేరుకుంది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కనబరిచిన అద్భుతమైన పనితీరుకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు రూ.200 కోట్ల అదనపు ప్రోత్సాహక నిధులను మంజూరు చేసింది. ఈ విషయాన్ని హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ వెల్లడించారు. ఈ నిధులను ప్రభుత్వ ఆసుపత్రుల్లో మాతా-శిశు ఆరోగ్య సేవలను మరింత బలోపేతం చేయడానికి, వైద్య మౌలిక వసతులను ఆధునికీకరించడానికి వినియోగించనున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన ఆసుపత్రుల్లో నవజాత శిశు సంరక్షణ విభాగాల విస్తరణతో పాటు లేబర్ రూములు, ఆపరేషన్ థియేటర్లను జాతీయ నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా అత్యాధునికంగా తీర్చిదిద్దనున్నట్లు వెల్లడించారు.

అలాగే మిడ్‌వైఫరీ-లెడ్ కేర్ యూనిట్లు, కంగారూ మదర్ కేర్ వార్డులు, లాక్టేషన్ మేనేజ్‌మెంట్ యూనిట్లను ఏర్పాటు చేయడంతో పాటు అధిక ప్రసవాలు జరిగే ఆసుపత్రుల్లో తల్లి, గర్భస్థ శిశువు ఆరోగ్యాన్ని పర్యవేక్షించే అత్యాధునిక వైద్య పరికరాలను అందుబాటులోకి తీసుకురానున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆరోగ్య సంస్థలను ఇండియన్ పబ్లిక్ హెల్త్ స్టాండర్డ్స్‌కు అనుగుణంగా అభివృద్ధి చేసి, నేషనల్ క్వాలిటీ అష్యూరన్స్ సర్టిఫికేషన్ సాధించేలా చర్యలు చేపట్టనున్నారు. ఈ చర్యలతో మాతృ మరణాలు, నవజాత శిశు మరణాల రేటు మరింత తగ్గుతుందని అధికారులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ దవాఖానల్లో చేరే ప్రతి గర్భిణీకి, ప్రతి నవజాత శిశువుకు అత్యుత్తమ ఉచిత వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని కమిషనర్ స్పష్టం చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment