నీట్ యూజీ (NEET UG) 2026 పరీక్ష రద్దు దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. మెడికల్ సీట్ల (Medical Seats) కోసం లక్షలాది మంది విద్యార్థులు ఏడాది పొడవునా కష్టపడి సిద్ధమవుతుండగా, ప్రశ్నాపత్రం లీక్(Question Paper Leak) ఆరోపణలతో పరీక్ష రద్దు కావడం విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన రేకెత్తించింది. ఈ వ్యవహారంపై మాజీ మంత్రి కేటీఆర్(KTR) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కేంద్ర ప్రభుత్వంపై (Central Government) మండిపడ్డారు. 2024లో జరిగిన ఘటన నుంచి పాఠాలు నేర్చుకోకపోవడం వల్లే మరోసారి నీట్ పరీక్ష పేపర్ లీక్ జరిగిందని ఆయన విమర్శించారు. విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్రం చెలగాటమాడుతోందని, పకడ్బందీగా పరీక్షలు నిర్వహించడంలో ఎన్డీఏ ప్రభుత్వం (NDA Government) పూర్తిగా విఫలమైందని ఎక్స్ వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేశారు.
దేశవ్యాప్తంగా సుమారు 23 లక్షల మంది విద్యార్థులు రాసిన ఈ ప్రతిష్టాత్మక పరీక్షలో వందకు పైగా ప్రశ్నలు ముందుగానే లీక్ అయ్యాయన్న ఆరోపణలు వెలుగులోకి రావడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. పరీక్షా వ్యవస్థపై నమ్మకం దెబ్బతినకుండా ఉండేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పరీక్షను రద్దు చేసినట్లు తెలుస్తోంది. ఈ కేసును కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే సీబీఐ(CBI) కి అప్పగించగా, గెస్ పేపర్ లీక్ వెనుక ఉన్న ముఠాలపై సమగ్ర దర్యాప్తు జరగనుంది. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వీలైనంత త్వరగా మళ్లీ పారదర్శకంగా నీట్ పరీక్ష నిర్వహించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.








