నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజీ దేశంలో ప్రకంపనలు సృష్టించింది. పేపర్ లీకేజీ కారణంగా దేశ వ్యాప్తంగా ఏకంగా 21 మంది విద్యార్థులు బలవన్మరణం చెందారు. పేపర్ లీకేజీ తరువాత జరిగిన పరీక్షలో తక్కువ మార్కులు వచ్చాయని ఏపీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
తిరుపతి ఎస్వీ నగర్కు చెందిన సాయి మేఘన అనే విద్యార్థిని వైద్య విద్య లక్ష్యంగా నీట్ పరీక్షకు సన్నద్ధమయ్యారు. ఈ ఏడాది మే నెలలో నిర్వహించిన మొదటి విడత నీట్ పరీక్షలో ఆమెకు మంచి మార్కులే (499 మార్కులు) వచ్చాయి. అయితే, ఆ సమయంలో నీట్ పేపర్ లీక్ కావడంతో దేశవ్యాప్తంగా కలకలం రేగింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తిరిగి మళ్లీ నీట్ పరీక్ష నిర్వహించింది.
మొదటి పరీక్షలో 499 మార్కులు సాధించిన సాయి మేఘనకు, రెండో విడత నీట్ పరీక్షలో కేవలం 390 మార్కులు మాత్రమే వచ్చాయి. మొదటి పరీక్షతో పోలిస్తే గణనీయంగా మార్కులు పడిపోవడంతో పాటు, పేపర్ లీక్ వ్యవహారం ఆమెను తీవ్ర మానసిక ఒత్తిడికి గురిచేశాయి. ఈ నేపథ్యంలోనే ఆమె తీవ్ర మనస్తాపానికి లోనై బలవన్మరణం చెందింది. ఈ ఘటన జరిగి పది రోజులు గడుస్తుండగా, ఆ విద్యార్థిని దశదిన కర్మ రోజున ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
సాయి మేఘన దశదిన కర్మ సందర్భంగా SFI నాయకులు ఆమె నివాసానికి వెళ్లారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నేతలు మాట్లాడుతూ.. ప్రభుత్వాలు, పరీక్షల నిర్వహణ సంస్థల నిర్లక్ష్యం వల్లే ఇటువంటి ప్రతిభావంతులైన విద్యార్థుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయని మండిపడ్డారు. నీట్ పేపర్ లీక్ వ్యవస్థ వైఫల్యమే ఈ మృతికి ప్రత్యక్ష కారణమని ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యంతో ప్రాణాలు కోల్పోయిన విద్యార్థిని కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని, బాధిత కుటుంబానికి కోటి రూపాయల ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు.
తిరుపతిలో నీట్ విద్యార్థిని ఆత్మహత్య
— Telugu Feed (@Telugufeedsite) August 10, 2026
ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన
ఎస్వీ నగర్కు చెందిన సాయి మేఘన నీట్ పేపర్ లీక్ కావడంతో మనస్తాపంతో ఆత్మహత్య
ఈ ఏడాది మే నెలలో మొదటి సారి నీట్ పరీక్షలో 499 మార్కులు రాగా, పరీక్ష లీక్ కావడంతో మళ్లీ నీట్ పరీక్ష నిర్వహణ
సాయి మేఘనకు రెండోసారి… pic.twitter.com/8gYbRlmhUa








