లోక్సభలో పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ చట్టం సవరణ బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో, దేశంలో యూపీఐ (UPI) లావాదేవీలపై ఛార్జీలు విధించబోతున్నారంటూ సోషల్ మీడియాలోనూ, ఇతర వర్గాల్లోనూ జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ అంశంపై వినియోగదారుల్లో నెలకొన్న ఆందోళనకు తెరదించుతూ ప్రముఖ డిజిటల్ పేమెంట్స్ సంస్థ ఫోన్పే (PhonePe) సీఈవో, సహ వ్యవస్థాపకుడు సమీర్ నిగమ్ స్పష్టతనిచ్చారు.
భారతీయ వినియోగదారులకు యూపీఐ డిజిటల్ చెల్లింపుల సేవలు ఎప్పటికీ ఉచితంగానే ఉంటాయని ఆయన ఖరాకండిగా ప్రకటించారు. “భారతీయ వినియోగదారులందరికీ యూపీఐ (UPI) సేవలు ఎప్పటికీ ఉచితంగానే ఉంటాయి. సాధారణ యూజర్లు యూపీఐ ద్వారా లావాదేవీలు చేసేందుకు ఎలాంటి అదనపు రుసుమూ చెల్లించాల్సిన అవసరం లేదు” అని ప్రకటించారు.
లక్షలాది మంది సామాన్యులకు యూపీఐ సాంకేతికతను అందుబాటులో ఉంచడమే ధ్యేయమని, వినియోగదారులపై ఎలాంటి రుసుముల భారం పడదని ఆయన స్పష్టం చేశారు.
ఇటీవల లోక్సభలో పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ 2007 చట్టానికి సవరణ బిల్లు ఆమోదం పొందింది. ప్రభుత్వం లేదా రిజర్వ్ బ్యాంక్ అవసరమైన సందర్భాల్లో డిజిటల్ చెల్లింపుల ప్లాట్ఫామ్లపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) విధించేలా చట్టపరమైన సవరణలకు వీలు కల్పించడంతో, సామాన్య యూజర్ల నుంచి కూడా ఛార్జీలు వసూలు చేస్తారేమోనన్న ప్రచారం ప్రారంభమైంది.
2016లో ప్రారంభమైన నాటి నుంచి డిజిటల్ ఇండియా నిర్మాణంలో యూపీఐ కీలక పాత్ర పోషిస్తోంది. ఫోన్పే సీఈవోతో పాటు పేమెంట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇచ్చిన స్పష్టతతో వినియోగదారులు, కిరాణా వ్యాపారులు యూపీఐ ఛార్జీల గురించి ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.









టీడీపీ నేర్పిన “సంస్కారం” ఇదేనా?