‘చంద్రబాబు.. మీకు ఆడపిల్లలు లేరా?’.. మెడికో తండ్రి ఆవేదన!

'చంద్రబాబు.. మీకు ఆడపిల్లలు లేరా?'.. మెడికో తండ్రి ఆవేదన!

Summarize with AI

రాజమండ్రిలో మద్యం మత్తులో ఉన్న ఉన్మాదులు కారుతో ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడి, ప్రస్తుతం అత్యంత విషమ పరిస్థితుల్లో హైద‌రాబాద్‌లో ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వైద్య విద్యార్థిని ప్రియాంక తండ్రి వెంకటేష్ ప్రభుత్వ వైఖరిపై తీవ్ర ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేశారు. రాజమండ్రి ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్‌కు వచ్చిన ఆయన, పోలీసులు నమోదు చేసిన కేసు వివరాలు, సెక్షన్లను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వం, పాలకులు తమ బిడ్డ పరిస్థితిని పట్టించుకోకపోవడంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

మృత్యువుతో పోరాడుతున్న తన బిడ్డ పరిస్థితిపై పాలకులు స్పందించకపోవడంపై ఆయన తీవ్రంగా మండిప‌డ్డారు.

“చంద్రబాబు గారూ.. మీకు ఆడపిల్లలు లేరా, అక్క‌చెల్లెమ్మ‌లు లేరా.. ఆడ‌పిల్ల‌ల బాధ మీకు తెలియ‌దా? వారం వారం హైదరాబాద్‌లోనే ఉంటారు కదా.. పక్కనే ఆసుపత్రిలో ఉన్న నా బిడ్డ పరిస్థితి తెలుసుకోరా? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కనీసం ఫోన్‌లో కూడా పరామర్శించలేదు. మంత్రి నారా లోకేష్, హోం మంత్రి అనిత సైతం కనీస మానవత్వం చూపలేదు. హోం మంత్రి అనితగారూ.. మీకు కూతురు లేదా? ఆడపిల్లలు అంటే మీకు దయలేదా?” అని వెంకటేష్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ప్రభుత్వం నుంచి రూపాయి సాయం లేదు
త‌మ కుమార్తె సంఘ‌ట‌న‌పై ఇప్ప‌టి వ‌ర‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం క‌నీసం స్పందించ‌లేద‌ని, ఫోన్ చేసి ఎలా ఉంద‌న్న మాట కూడా మాట్లాడ‌లేద‌ని వెంక‌టేష్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. తన కూతురు చికిత్స కోసం అవుతున్న ఖర్చులన్నీ తమ కుటుంబమే భరిస్తోందని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక లేదా నైతిక సహకారం అందలేదని తండ్రి స్పష్టం చేశారు.

స్థానిక ఎమ్మెల్యే ఫోన్ చేసి ‘అండగా ఉంటాం’ అని చెప్పినప్పటికీ, ఆ తర్వాత ఎలాంటి సాయం చేయలేదని ఆరోపించారు. నేతలు ఎవరూ ఆసుపత్రికి వచ్చి పరామర్శించలేదని, కనీసం ఫోన్ చేసి కూడా పరామర్శించకపోవడం బాధితుల పట్ల వారికున్న నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆవేదన వ్యక్తం చేశారు. కేసును నీరుగార్చేలా పొలిటికల్ ప్రెజర్ ఏమైనా ఉందా అనే అనుమానంతోనే పోలీసులను కలిసి కేసు వివరాలను అడిగామని, పొలిటికల్ ప్రభావం రాకుండా పారదర్శకంగా న్యాయం చేస్తారనే నమ్మకంతో ఉన్నామని చెప్పారు.

ఘటన జరిగిన తీరును వివరిస్తూ ఇది కేవలం ప్రమాదం కాదని, ఉద్దేశపూర్వకంగా చేసిన హత్యాయత్నమేనని స్పష్టం చేశారు. నిందితులు మద్యం సేవించి విచక్షణారహితంగా కారు నడిపారని, ముందు వెళ్తున్న వారు చనిపోతారని తెలిసినా వేగంగా వచ్చి తలపై కారు ఎక్కించారని తెలిపారు. ప్రస్తుతం ప్రియాంక ఆరోగ్యం అత్యంత విషమంగా ఉందని, అవయవాలు క్రమంగా పనిచేయకుండా పోతున్నాయని కన్నీరుమున్నీరయ్యారు.

బంగారు భవిష్యత్తు ఉన్న తన కూతురి జీవితాన్ని నాశనం చేసిన నిందితులకు అత్యంత కఠిన శిక్ష పడాలని ప్రియాంక తండ్రి డిమాండ్ చేశారు. ఆడపిల్లలను ఇలా చంపేస్తూ సమాజంలో స్వేచ్ఛగా తిరగవచ్చా? మా కుటుంబానికి ఇది తీరని లోటు. మా ఆశల సౌధం కుప్పకూలిపోయింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మానవత్వం చూపాలి, మాకు పూర్తి న్యాయం చేయాలి” అని కోరారు.

Join WhatsApp

Join Now

Leave a Comment