ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాజకీయాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) చేసిన “మావిగన్”(MAVIGUN) ప్రకటన తీవ్ర చర్చకు దారితీసింది. రాబోయే ఎన్నికల అజెండాలో “మావిగన్”(MAVIGUN) ను చేర్చుతామని జగన్ స్పష్టంగా ప్రకటించడంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. జగన్ ప్రకటన వెలువడిన క్షణాల వ్యవధిలోనే అధికార కూటమి నుంచి వరుసగా ప్రతిస్పందనలు వచ్చాయి.
ముఖ్యమంత్రి చంద్రబాబు (Nara Chandrababu Naidu) మొదలుకొని మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ అధికార ప్రతినిధులు వరుసగా మీడియా ముందుకు వచ్చి జగన్ వ్యాఖ్యలపై స్పందించారు. గతంలో మచిలీపట్నం(Machilipatnam), విజయవాడ(Vijayawada), గుంటూరు (Guntur) అదే సీఆర్డీయే (CRDA) అని సర్దిచెప్పిన సీఎం చంద్రబాబు ఇప్పుడు “మావిగన్ అంటే తనకు అర్థం కావడం లేదు” అని వ్యాఖ్యానించారు. మరోవైపు పలువురు టీడీపీ (Telugu Desam Party), జనసేన నాయకులు మాత్రం మావిగన్ కంటే జగన్ను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
“మూడు రాజధానులు” (Three Capitals) నినాదంతో ప్రజల్లోకి వెళ్లిన వైసీపీకి(YSRCP) గత ఎన్నికల్లో 11 సీట్లు మాత్రమే వచ్చాయని, ఇప్పుడు “మావిగన్” అజెండాతో ఎన్నికలకు వెళ్తే ఒక్క సీటు కూడా గెలవలేరని టీడీపీ నేతలు ఎవరికి నచ్చిన జోస్యం వారు చెబుతున్నారు.
అయితే టీడీపీ కామెంట్స్కు వైసీపీ లాజిక్గా బదులిస్తోంది. 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం అమరావతిని (Amaravati) ఏకైక రాజధానిగా ప్రకటించినప్పటికీ, ఆ తర్వాత జరిగిన 2019 ఎన్నికల్లో ప్రజలు కేవలం 23 అసెంబ్లీ స్థానాలే ఇచ్చారని గుర్తు చేస్తుంది. కాబట్టి రాజధాని అంశాన్ని మాత్రమే ఎన్నికల ఫలితాలకు ప్రమాణంగా చూపడం సరికాదని వైసీపీ నేతలు వాదిస్తున్నారు.
అలాగే 2019 ఎన్నికలకు ముందు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కూడా అమరావతి అంశంపై టీడీపీ ప్రభుత్వ నిర్ణయాన్ని బహిరంగంగా వ్యతిరేకించిన విషయాన్ని వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. రాజధాని అంశం ఒక్కటే ఎన్నికల్లో విజయాపజయాలను నిర్ణయించదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అభివృద్ధితో పాటు పారదర్శక పాలన, అవినీతి(Corruption), అక్రమాలకు అడ్డుకట్ట(Control of Illegal Activities), ప్రజలకు అందే సేవలు వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని ప్రజలు తీర్పు ఇస్తారని చెబుతున్నారు.
ఇదిలా ఉండగా, జగన్ను వ్యతిగతంగా టార్గెట్ చేసిన టీడీపీ(TDP) నాయకులు.. “మావిగన్” కంటే అమరావతిలో ఇప్పటికే ఉన్న అదనపు ఫెసిలిటీస్ ఏమిటి? అవి రాష్ట్రానికి ఎలా ప్రయోజనం చేకూరుస్తాయి? అనే అంశాలను ప్రజలకు వివరించి ఉంటే బాగుండేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వ్యక్తిగత విమర్శల కంటే విధానపరమైన చర్చలే ప్రజలకు ఉపయోగపడతాయని పలువురు రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
మరోవైపు వైసీపీ నేతలు మాత్రం అమరావతితో పోలిస్తే “మావిగన్” ఎందుకు మెరుగైన ప్రత్యామ్నాయమని భావిస్తున్నారో తమ వాదనలు, లెక్కలు, భౌగోళిక, ఆర్థిక అంశాలను ప్రస్తావిస్తూ ప్రజలకు వివరిస్తున్నారు.
మొత్తానికి జగన్ చేసిన “మావిగన్” ప్రకటనతో ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేచింది. అధికార కూటమి, ప్రతిపక్షం మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు కొనసాగుతున్నప్పటికీ, ప్రజలు మాత్రం రాజకీయ ఆరోపణల కంటే వాస్తవాలు, విధానాలు, రాష్ట్రానికి ఏది ఎక్కువ ప్రయోజనం చేకూరుస్తుందనే అంశాలపై స్పష్టమైన సమాధానాలు కోరుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.








