ఢిల్లీలో ఉగ్రదాడి కుట్ర భగ్నం.. నలుగురు అరెస్ట్

ఢిల్లీలో ఉగ్రదాడి కుట్ర భగ్నం.. నలుగురు అరెస్ట్

దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) భారీ ఉగ్రదాడికి (Terror Attack)సంబంధించిన కుట్రను ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్ (Special Cell) భగ్నం చేసింది. ఈ కేసులో నలుగురు అనుమానితులను అరెస్ట్ చేసిన పోలీసులు, వారి వద్ద నుంచి విదేశీ ఆయుధాలు, తూటాలు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు పాకిస్థాన్‌కు (Pakistan) చెందిన ఐఎస్ఐ హ్యాండ్లర్ (ISI Handler) షెహ్జాద్ భట్టి (Shehzad Bhatti) ఆదేశాల మేరకు దాడులకు కుట్ర పన్నినట్లు విచారణలో వెల్లడైంది.

పోలీసుల వివరాల ప్రకారం.. అరెస్ట్ అయిన నిందితుల్లో ముగ్గురు పంజాబ్‌కు (Punjab) చెందిన వారు కాగా, మరొకరు ఢిల్లీకి చెందిన వ్యక్తి. వారి వద్ద నుంచి రెండు విదేశీ తయారీ పిస్టల్స్‌(Pistols), తొమ్మిది తూటాలు(Bullets), ఐదు మొబైల్ ఫోన్లను(Mobile Phones) స్వాధీనం చేసుకున్నారు. విచారణలో కీలక విషయాలు బయటపడ్డాయి. నిందితులు విదేశీ నంబర్ల ద్వారా పాకిస్థాన్ హ్యాండ్లర్లతో నిరంతరం సంప్రదింపులు జరిపినట్లు పోలీసులు గుర్తించారు.

డ్రోన్ల సాయంతో ఆయుధాలు, మాదకద్రవ్యాలను భారత్‌లోకి(India) తెప్పించుకున్నట్లు విచారణలో వెల్లడైంది. దాడులకు ముందు ఢిల్లీలోని పలు పోలీస్ స్టేషన్లు, ప్రార్థనా స్థలాల వద్ద నిందితులు రెక్కీ నిర్వహించినట్లు స్పెషల్ సెల్ అధికారులు తెలిపారు. కాల్పుల ఘటనను అమలు చేసే బాధ్యతను గగన్‌ప్రీత్ (Gaganpreet) అనే వ్యక్తికి అప్పగించినట్లు కూడా దర్యాప్తులో తేలిందని వెల్లడించారు.

ఈ ఘటనపై భారతీయ న్యాయ సంహిత (BNS), ఆర్మ్స్ యాక్ట్ (Arms Act) కింద కేసు నమోదు చేసిన పోలీసులు, ఈ ఉగ్ర నెట్‌వర్క్‌కు సంబంధించిన ఇతర అనుబంధాలు, విదేశీ హ్యాండ్లర్ల పాత్రపై లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. దేశ భద్రతకు ముప్పుగా మారే కుట్రను ముందుగానే భగ్నం చేయడంతో భారీ ప్రమాదం తప్పిందని అధికారులు పేర్కొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment