ఆంధ్రప్రదేశ్లో తీవ్ర రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలోని గాదె సాయికృష్ణ అదృశ్యం, లాకప్డెత్ వ్యవహారంపై ప్రముఖ న్యాయవాది, జై భీమ్ రావ్ భారత్ పార్టీ వ్యవస్థాపకుడు జడ శ్రవణ్ కుమార్ పిన్ టు పిన్ సంచలన నిజాలను బయటపెట్టారు. ఈ కేసు వివరాలను మీడియా ముందు ఉంచిన ఆయన.. ఇది కేవలం లాకప్ డెత్ మాత్రమే కాదు, ఒక పథకం ప్రకారం చేసిన ‘ప్రీ-ప్లాన్డ్ మర్డర్’ అని అభివర్ణించారు. హీరో సూర్య నటించిన హిట్ సినిమా ‘జై భీమ్’లో చూపించిన పోలీస్ అరాచకాల కంటే ఇది 100 రెట్లు ఘోరమైనదని, ఈ దారుణంలో పోలీస్ వ్యవస్థ మొత్తం ఇన్వాల్వ్ అయిందని ఆయన ఆరోపించారు.
జడ శ్రవణ్ కుమార్ వెల్లడించిన పూర్తి వివరాల ప్రకారం.. సాయికృష్ణ కేసు అరెస్ట్ నుంచి అంత్యక్రియల వరకు ఏం జరిగింది?
జూన్ 8వ తేదీ సాయంత్రం సాయికృష్ణ తన మిత్రుడితో కలిసి మార్కాపురంలో ఒక రూమ్లో ఉంటుండగా.. టాస్క్ ఫోర్స్ సీఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు, కృష్ణలంక పీఎస్కు చెందిన ఒక ఏఎస్ఐ, బ్లూ కోర్ట్ కానిస్టేబుల్ కలిసి అతడిని బలవంతంగా విజయవాడకు తరలించారు. ఆ రాత్రి కృష్ణలంక పోలీస్ స్టేషన్లోనే ఉంచారు.
జూన్ 9వ తేదీ ఉదయం సాయికృష్ణను కృష్ణలంక పోలీస్ స్టేషన్ నుంచి టాస్క్ ఫోర్స్ ఆఫీస్కు తరలించి, అక్కడ ఒక రోజు పాటు ఉంచారు.
జూన్ 10 నుంచి 13 వరకు రమేష్ హాస్పిటల్ పక్కనే ఉన్న ఒక ప్రముఖ హోటల్లో రూమ్ నెంబర్ 302ను కృష్ణలంక సీఐ నాగరాజు పేరు మీద బుక్ చేశారు. పగలంతా టాస్క్ ఫోర్స్ పోలీసులు, రాత్రి వేళల్లో సీఐ నాగరాజు సాయికృష్ణను థర్డ్ డిగ్రీ ఉపయోగించి విపరీతంగా చిత్రహింసలకు గురిచేశారు.
జూన్ 14వ తేదీన పోలీసుల దెబ్బలకు సాయికృష్ణ దవడ పగిలిపోయి, కిడ్నీలు దెబ్బతిని విపరీతంగా బ్లీడింగ్ అయింది. పరిస్థితి విషమించడంతో పోలీసులు వంగవీటి రంగా ఇంటి ముందున్న ప్రజా వైద్యశాలకు తరలించారు. అయితే, ఇతను బతికే అవకాశం లేదని, ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లాలని అక్కడి డాక్టర్లు నిరాకరించారు.
జూన్ 15 తేదీన పోలీసులు సాయికృష్ణను మణిపాల్ హాస్పిటల్లో చేర్పించి చికిత్స అందించారు. అయితే 16వ తేదీన అక్కడి డాక్టర్లు కూడా చేతులెత్తేయడంతో, మళ్లీ పాత హోటల్ రూమ్కే తీసుకొచ్చి ఓ ఆర్ఎంపి డాక్టర్ చేత రెండు రోజులు రహస్యంగా వైద్యం చేయించారు.
జూన్ 23వ తేదీ సాయంత్రం పోలీసుల థర్డ్ డిగ్రీ దెబ్బలకు తాళలేక, సరైన వైద్యం అందక సాయికృష్ణ హోటల్ రూమ్లోనే కన్నుమూశాడు.
బస్టాండ్లో అనాథ శవంగా..
జూన్ 24వ తేదీ హత్యను దాచిపెట్టేందుకు పోలీసులు సాయికృష్ణ మృతదేహాన్ని ఆర్టీసీ బస్టాండ్లోని ప్లాట్ఫామ్ నెంబర్ 43 దగ్గర అనాథ శవంలా పడేశారు. ఆ తర్వాత కృష్ణలంక పోలీసులకే సమాచారం వచ్చినట్లు డ్రామా ఆడారు. సీఐ నాగరాజే ఇది అనాథ శవమని సర్టిఫికెట్ ఇచ్చి,వీఎంసి (VMC) ద్వారా ఎలక్ట్రికల్ శ్మశాన వాటిక (స్వర్గపురి)లో సాయంత్రం 5:45 గంటలకు ఖననం చేయించి సాక్ష్యాలను పూర్తిగా రూపుమాపారు అని ప్రముఖ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ పిన్ టు పిన్ సీన్ను మీడియాకు వివరించడం సంచలనంగా మారింది. సాయికృష్ణ కేసు ‘జై భీమ్’లో చూపించిన పోలీస్ అరాచకాల కంటే ఇది 100 రెట్లు మించిన సినిమా అవుతుందన్నారు.
ప్రస్తుతం ఈ కేసు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. హైకోర్టు ఆదేశాల మేరకు రాజమహేంద్రవరం ఎస్పీ నరసింహ కిషోర్ ఆధ్వర్యంలో విచారణ వేగవంతం కాగా, సీఐ నాగరాజుపై కేసు నమోదైంది. ఫోరెన్సిక్ బృందాలు కృష్ణలంక పీఎస్లో ఆధారాలు సేకరిస్తున్నాయి. మరి ఈ కేసులో ఇంకా ఎలాంటి నిజాలు బయటకు వస్తాయో చూడాలి.
ఇదే నిజం అయితే దీనికన్నా ఘోరం ఇంకొకటి ఉండదు….pic.twitter.com/QGKzi67TL3
— 𝓖𝓳𝓴𝓲𝓻𝓪𝓷 (@Gjkiran20) June 20, 2026








