సోషల్ మీడియా దిగ్గజం మెటా (Meta) ప్లాట్ఫామ్లలో బాలల లైంగిక వేధింపుల కంటెంట్ (CSAM), డీప్ఫేక్ వీడియోల విస్తరణ(Deepfake Videos Spread), నిర్వహణ వైఫల్యాలపై మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్ (Mark Zuckerberg) భారత ప్రభుత్వానికి క్షమాపణలు తెలియజేశారు. మెటా ప్లాట్ఫామ్లలో సమాజానికి హానికరమైన కంటెంట్ను నియంత్రించడంలో జరిగిన లోపాలను కంపెనీ అంగీకరించింది.
ఆగస్టు 5న మెటా గ్లోబల్ ఎఫైర్స్ చీఫ్ జోయెల్ కాప్లాన్తో(Joel Kaplan) పాటు పలువురు గ్లోబల్ ఎగ్జిక్యూటివ్ల బృందం, కేంద్ర ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ (MeitY) మంత్రి అశ్విని వైష్ణవ్తో పాటు ఇతర ఉన్నతాధికారులతో సమావేశమైంది.
ఈ సమావేశంలో కేంద్ర అధికారులు మెటా తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మెటా కేవలం సమాచారాన్ని చేరవేసే మధ్యవర్తి (Passive Intermediary) లాగా వ్యవహరించడం లేదని, వినియోగదారులకు ఏ కంటెంట్ వెళ్లాలో స్వయంగా ప్రమోట్ చేస్తూ నిర్దేశిస్తోందని అధికారులు స్పష్టం చేశారు. డబ్బులు తీసుకుని నిర్దిష్ట కంటెంట్ను ప్రమోట్ చేస్తున్నందున, ఐటీ చట్టం-2000 (IT Act, 2000) కింద మధ్యవర్తులకు లభించే ‘సేఫ్ హార్బర్’ (Safe Harbour) లీగల్ సెఫ్టీని మెటా కోల్పోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) అధికారిక ఫేస్బుక్ ఖాతా నుంచి పోస్ట్ చేసిన ఒక వీడియోను మెటా తాత్కాలికంగా తొలగించడం తీవ్ర దుమారం రేపింది. దీనిపై పార్లమెంటరీ కమిటీ తీవ్రంగా స్పందించింది. మరోవైపు, బాలల లైంగిక వేధింపులు, ప్రచార ప్రకటనలకు సంబంధించిన వ్యవహారంపై నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (NCPCR) కూడా మెటాపై విచారణ ప్రారంభించింది.
ఈ అన్ని అంశాలపై పెయిడ్ ప్రమోషన్ల నిర్వహణలో పొరపాట్లు జరిగాయని మెటా ప్రతినిధులు ఒప్పుకుంటూ, ఖేదం వ్యక్తం చేశారు. అయితే ఈ పరిణామాలపై మెటా అధికారికంగా ఇంకా బహిరంగ ప్రకటన విడుదల చేయాల్సి ఉంది.








బాబు పాలనలో గంజాయి పంటకే గిట్టుబాటు ధర