రాష్ట్రానికి లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని, పెద్ద సంఖ్యలో పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయని చంద్రబాబు ప్రభుత్వం (Chandrababu Government) చేసుకుంటున్న ప్రచారానికి కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. టీడీపీ(TDP) లెక్కలకు వాస్తవ లెక్కలకు చాలా తేడాలు ఉన్నాయని తెలిపింది. గత రెండేళ్లలో ఏపీలో డీపీఐఐటీ (DPIIT), ఇన్వెస్ట్ ఇండియా (Invest India) పర్యవేక్షించిన పెట్టుబడి ప్రతిపాదనల్లో కేవలం పది ప్రాజెక్టులు మాత్రమే గ్రౌండ్ అయినట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ లోక్సభకు తెలిపింది.
వైసీపీ (YSRCP) ఎంపీ పీవీ మిథున్రెడ్డి (PV Mithun Reddy) అడిగిన ప్రశ్నకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద (Jitin Prasada) మంగళవారం లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. గ్రౌండ్ అయిన పది ప్రాజెక్టుల్లో కేవలం రెండు ప్రాజెక్టుల తయారీ యూనిట్ల నిర్మాణం మాత్రమే పూర్తయిందని, మిగిలిన ఎనిమిది ప్రాజెక్టులు ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నాయని కేంద్రం స్పష్టం చేసింది. ఈ ప్రాజెక్టుల మొత్తం పెట్టుబడి రూ.6,962 కోట్లుగా అంచనా వేసినట్లు వెల్లడించింది. ఈ ప్రాజెక్టుల ద్వారా సుమారు 22,167 ఉద్యోగాలు లభించే అవకాశం ఉందని కేంద్రం పేర్కొంది. అయితే ఇవి ఇప్పటికే కల్పించిన ఉద్యోగాలు కావు.
అయితే రాష్ట్ర ప్రభుత్వం రూ.22 లక్షల 87 వేల కోట్లు పెట్టుబడులు వచ్చాయని, 21 లక్షల 30 వస్తాయని సీఎం చంద్రబాబు (CM Chandrababu) బహిరంగ వేదికలపై చెప్పే స్టేట్మెంట్లు అన్నీ అవాస్తవాలు అని కేంద్ర ప్రభుత్వం లిఖితపూర్వక సమాధానంతో తేలిపోయింది. దేశంలో రూపాయిలో 25 పైసల పెట్టుబడులు ఏపీకే వస్తున్నాయని మంత్రి నారా లోకేష్(Nara Lokesh) చెబుతున్న ప్రకటనలు అన్నీ అబద్ధాల బుడగలు కేంద్రం లేఖతో పేలిపోయాయి.
శిక్షణ పొందిన వారే.. పారిశ్రామికవేత్తలు కాదు
ఎంఎస్ఎంఈలు (MSMEs), స్థానిక పారిశ్రామికవేత్తలకు కేంద్ర పథకాల ద్వారా కలిగిన ప్రయోజనాలపై అడిగిన ప్రశ్నకు కేంద్రం నైపుణ్యాభివృద్ధి (Centre Skill Development), వ్యవస్థాపక శిక్షణ కార్యక్రమాల వివరాలను ఇచ్చింది. 2024–25లో 201 కార్యక్రమాల ద్వారా 10,093 మంది, 2025–26లో 625 కార్యక్రమాల ద్వారా 32,428 మంది లబ్ధిపొందినట్లు తెలిపింది.
అయితే వీరిలో ఎంతమంది కొత్త పరిశ్రమలను ఏర్పాటు చేశారు, ఎంతమందికి ఆర్థిక సహాయం అందింది, ఎన్ని ఎంఎస్ఎంఈలు ఉత్పత్తి ప్రారంభించాయి, వాటి ద్వారా ఎన్ని ఉద్యోగాలు వచ్చాయన్న వివరాలు మాత్రం సమాధానంలో లేవు. శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొన్న వారందరినీ పారిశ్రామికవేత్తలు, ఉద్యోగాలు పొందిన వారిగా చూపించలేమన్న విషయం స్పష్టమవుతోంది.
మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న భారీ పెట్టుబడులు, లక్షల ఉద్యోగాల ప్రచారానికి.. లోక్సభలో (Lok Sabha) కేంద్ర ప్రభుత్వం (Central Government) వెల్లడించిన వాస్తవ లెక్కలకు మధ్య భారీ వ్యత్యాసం ఉందని స్పష్టమవుతోంది. రెండేళ్లలో పూర్తయినవి రెండు పరిశ్రమల నిర్మాణాలు మాత్రమే కాగా, మిగిలిన పెట్టుబడులు, ఉద్యోగాలన్నీ ఇంకా ప్రతిపాదనలు, నిర్మాణాలు, అంచనాల దశలోనే ఉన్నాయని కేంద్ర సమాధానం తేల్చిచెప్పింది. మరి కేంద్ర ప్రభుత్వ సమాధానానికి చంద్రబాబు ప్రభుత్వం ఏ విధంగా కవర్ చేసుకుంటుందో చూడాలి.








