వైఎస్ జగన్ శ్రీకాకుళం పర్యటనపై పోలీసుల తీవ్ర ఆంక్షలు

వైఎస్ జగన్ శ్రీకాకుళం పర్యటనపై పోలీసుల తీవ్ర ఆంక్షలు

Summarize with AI

మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ శ్రీకాకుళం పర్యటన వేళ జిల్లాలో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. జైలులో ఉన్న మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పరామర్శించేందుకు జగన్ వస్తుండటంతో పోలీసులు భారీగా ఆంక్షలు విధించారు. జిల్లావ్యాప్తంగా, ముఖ్యంగా అంపోలు జైలు, శ్రీకాకుళం టౌన్ పరిసర ప్రాంతాలలో, వైఎస్ జ‌గ‌న్ ప్ర‌యాణించే మార్గంలో పోలీసు బలగాలు భారీగా మోహరించాయి.

జైలులో ఉన్న‌ సీదిరి అప్పలరాజుతో జగన్ ములాఖత్ కావడానికి మాత్రమే అనుమ‌తి ఉంద‌ని ఎస్పీ చెప్పారు. ఎలాంటి ర్యాలీలు, బహిరంగ సభలు, రోడ్‌షోలు లేదా సమావేశాలు నిర్వహించడానికి పోలీసులు అనుమతి నిరాకరించారు. వైఎస్ జగన్ కాన్వాయ్‌లో కేవలం 8 వాహనాలకు మాత్రమే అనుమతి ఇచ్చారు. పోలీసుల నిబంధనలు, ఆంక్షలను ఉల్లంఘిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చ‌రించారు.

అడుగడుగునా ఆంక్షలు.. వైసీపీ శ్రేణుల నిరసనలు
ఒకవైపు విశాఖపట్నం ఎయిర్‌పోర్టుకు వైఎస్ జగన్‌కు స్వాగతం పలికేందుకు అభిమానులు, వైసీపీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. అయితే శ్రీకాకుళం జిల్లా సరిహద్దులు, పలాస నియోజకవర్గాల్లో పోలీసులు తీవ్ర తనిఖీలు చేపట్టారు. జగన్ పర్యటనకు వస్తున్న వైసీపీ నేతలను, కార్యకర్తలను పోలీసులు అడుగడుగునా అడ్డుకుంటుండటంతో జిల్లా వ్యాప్తంగా ఉద్రిక్తత నెలకొంది.

జ‌గ‌న్‌ పర్యటనకు వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే సంబంగి చిన్న వెంకట అప్పలనాయుడిని పోలీసులు అడ్డుకోవడంతో, ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన అనుచరులతో కలిసి రోడ్డుపైనే బైఠాయించి నిరసన తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలోని పలాస నియోజకవర్గాన్ని పోలీసులు దాదాపు అష్టదిగ్బంధనం చేశారు. పలువురు నాయకులను ముందస్తుగా గృహనిర్బంధం చేయడం, వాహనాలను తనిఖీ చేసి వెనక్కి పంపడం వంటి చర్యలు చేపట్టారు.

‘ప్రభుత్వ కుట్ర’ అని వైసీపీ ఆగ్రహం
మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుపై త‌ప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపడమే కాకుండా, ఆయనను పరామర్శించేందుకు వస్తున్న పార్టీ అధినేత వైఎస్ జగన్ పర్యటనను భగ్నం చేసేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని వైసీపీ నాయకులు మండిపడుతున్నారు. పోలీసు బలగాలను ఉపయోగించి ప్రతిపక్ష నాయకుల ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నారని వారు ఆరోపించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment