జడేజా రీఎంట్రీ.. శ్రీలంక టెస్టు సిరీస్‌కు రెడీ

జడేజా రీఎంట్రీ.. శ్రీలంక టెస్టు సిరీస్‌కు టీమిండియా జట్టు ప్రకటించిన బీసీసీఐ!

Summarize with AI

శ్రీలంకతో ఆగస్టులో ప్రారంభమయ్యే రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు బీసీసీఐ 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ప్రకటించింది. శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా కొనసాగుతుండగా, కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. టెన్నిస్ ఎల్బో గాయం నుంచి పూర్తిగా కోలుకున్న సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా మళ్లీ టెస్టు జట్టులోకి రావడం భారత జట్టుకు భారీ ఊరటనిచ్చింది.

శ్రీలంక స్పిన్‌కు అనుకూలమైన పిచ్‌లను దృష్టిలో ఉంచుకుని జడేజాతో పాటు కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్‌లకు కూడా చోటు కల్పించారు. మరోవైపు దేశవాళీ క్రికెట్‌లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న మధ్యప్రదేశ్ యువ స్పిన్ ఆల్‌రౌండర్ సరన్ష్ జైన్‌కు తొలిసారి భారత టెస్టు జట్టులో అవకాశం దక్కింది. హామ్‌స్ట్రింగ్ గాయంతో తొలి టెస్టుకు దూరమైన వాషింగ్టన్ సుందర్ స్థానంలో అతడిని ఎంపిక చేశారు.

ఇక స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, యువ బ్యాటర్ సాయి సుదర్శన్‌ల ఎంపిక ఫిట్‌నెస్ క్లియరెన్స్‌కు లోబడి ఉంటుందని బీసీసీఐ స్పష్టం చేసింది. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (COE) నుంచి ఫిట్‌నెస్ సర్టిఫికెట్ వచ్చిన తర్వాతే వారి తుది ఎంపికపై నిర్ణయం తీసుకోనున్నారు.

శ్రీలంక పర్యటనకు ముందు ఆగస్టు 7 నుంచి కొలంబోలో భారత జట్టు నాలుగు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుండగా, తొలి టెస్టు ఆగస్టు 15 నుంచి 19 వరకు గాలేలో, రెండో టెస్టు ఆగస్టు 23 నుంచి 27 వరకు కొలంబోలోని ఎస్‌ఎస్‌సీ మైదానంలో జరగనుంది. గత సీజన్‌లో దక్షిణాఫ్రికాతో స్వదేశంలో 0-2తో టెస్టు సిరీస్ కోల్పోయి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (WTC) పాయింట్ల పట్టికలో వెనుకబడిన టీమిండియా, ఈ సిరీస్‌లో విజయం సాధించి మళ్లీ పుంజుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Join WhatsApp

Join Now

Leave a Comment