అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉండవల్లి గుహల వద్ద ఏపీ ప్రభుత్వం ‘యోగాంధ్ర 2026’ కార్యక్రమం నిర్వహించింది. సీఎం చంద్రబాబు నాయుడు ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్తో కలిసి యోగా సాధన చేశారు. ఈ సందర్భంగా యోగా గురువు బాబా రాందేవ్.. ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివిధ రకాల యోగా ప్రక్రియలు వివరించారు.
కార్యక్రమంలో పాల్గొన్న యోగా గురువు బాబా రాందేవ్ సీఎం చంద్రబాబు నాయుడిపై ప్రశంసల వర్షం కురిపించారు. “సీఎం చంద్రబాబు నన్ను ఈ వేడుకకు ముఖ్య అతిథిగా రమ్మన్నారు.. కానీ నేను ఇక్కడికి యోగా అతిథిగా వచ్చాను. ఈ వయస్సులో కూడా సీఎం చంద్రబాబు ఎంతో ఆరోగ్యంగా, చురుగ్గా ఉన్నారు. ఆయన కేవలం రాజకీయ నాయకుడు కాదు.. ఒక యోగి, నిరంతరం శ్రమించే కర్మయోగి. ఆయన యోగ ప్రేమికుడు, సర్వజన ప్రేమికుడు అంటూ ఆకాశానికి ఎత్తారు.
రాజధాని అయిన అమరావతి.. ఇప్పుడు యోగ రాజధానిగా మారింది. స్విట్జర్లాండ్ వంటి అందాలు అమరావతిలో కనిపిస్తున్నాయి. ఉండవల్లి గుహల్లో కొలువై ఉన్న అనంత పద్మనాభ స్వామిని దర్శించుకోవడం నా పూర్వజన్మ సుకృతం. ఇక్కడి అరటి, మామిడి పండ్లు సహజసిద్ధంగా పండినవి కావడం వల్లే చాలా రుచిగా ఉన్నాయన్నారు యోగా గురువు రాందేవ్.
రాష్ట్ర వ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమాలు చేపట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం రూ.10 కోట్లు మంజూరు చేసిన విషయం తెలిసిందే. 2025లో విశాఖలో నిర్వహించిన యోగాంధ్ర వేడుకకు ఏకంగా రూ.300 కోట్లు ఖర్చు చేశారు. టీషర్ట్స్, మ్యాట్స్, ట్రాన్స్పోర్ట్ ఖర్చులు, ఈవెంట్ నిర్వాహణకు భారీ మొత్తంలో రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది.








