స్వర్గీయ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసులో తదుపరి దర్యాప్తు చేపట్టాలని కోరుతూ వివేకా కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను హైదరాబాద్ నాంపల్లిలోని సీబీఐ కోర్టు కొట్టివేసింది. కేసులో సమగ్ర దర్యాప్తు ఇప్పటికే పూర్తయిందన్న సీబీఐ వాదనలతో న్యాయస్థానం ఏకీభవిస్తూ సునీత పిటిషన్ను డిస్మిస్ చేసింది.
వివేకానందరెడ్డి హత్య కేసును విచారించిన సీబీఐ ఇప్పటికే ఛార్జ్షీట్ దాఖలు చేసింది. అయితే దర్యాప్తు పూర్తిస్థాయిలో జరగలేదని, ఇంకా పలువురిని ప్రశ్నించాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ సునీతారెడ్డి సీబీఐ కోర్టును ఆశ్రయించారు. అన్ని కోణాల్లో మరింత లోతుగా దర్యాప్తు జరిపించాలని తన పిటిషన్లో కోరారు.
వివేకా కేసులో అన్ని కోణాల్లో సమగ్రంగా దర్యాప్తు నిర్వహించామని, విచారణ ప్రక్రియను పూర్తి చేసిన తర్వాతే ఛార్జ్షీట్ దాఖలు చేసినట్లు కోర్టుకు తెలిపింది. ప్రస్తుతం అదనంగా దర్యాప్తు చేయాల్సిన అవసరం లేదని సీబీఐ పేర్కొంది. అయితే న్యాయస్థానం తదుపరి దర్యాప్తునకు ఆదేశిస్తే, ఆ మేరకు విచారణ చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేసింది.
ఇరుపక్షాల వాదనలు విన్న నాంపల్లి సీబీఐ కోర్టు.. కేసులో సమగ్ర విచారణ పూర్తయిందన్న సీబీఐ వాదనతో ఏకీభవించింది. దీంతో సునీతారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేస్తూ నిర్ణయం తీసుకుంది. వివేకానందరెడ్డి హత్య కేసులో తదుపరి దర్యాప్తు జరపాలని సునీతారెడ్డి కోరుతున్న నేపథ్యంలో సీబీఐ కోర్టు ఇచ్చిన తాజా తీర్పు ప్రాధాన్యం సంతరించుకుంది.








