రాష్ట్రంలో తీవ్ర ధరల సంక్షోభంతో తల్లడిల్లుతున్న పొగాకు రైతుల సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు వచ్చే వారం, పది రోజుల్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నట్లు వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటించారు. బుధవారం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో పొగాకు రైతులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశం అనంతరం ఆయన మాట్లాడారు.
ధరల సంక్షోభంలో ఉన్న రైతులకు అండగా నిలిచేందుకు గోపాలపురం లేదా జంగారెడ్డిగూడెంలో పర్యటిస్తానని, పొగాకు రైతులను ప్రత్యక్షంగా కలిసి వారి సమస్యలు తెలుసుకోవడంతో పాటు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. పశ్చిమ గోదావరి పర్యటన తర్వాత కూడా కూటమి ప్రభుత్వంలో చలనం రాకపోతే, కొద్దిరోజుల వ్యవధిలోనే ప్రకాశం జిల్లా కందుకూరులోనూ పర్యటిస్తానని జగన్ స్పష్టం చేశారు.
94 రోజులు గడిచినా 16.5 శాతమే కొనుగోళ్లు
చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యంపై వైఎస్ జగన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో దాదాపు 232 మిలియన్ కిలోల పొగాకు పండితే, వేలం ప్రారంభమై 94 రోజులు దాటినా కేవలం 38 మిలియన్ కిలోలు (16.5 శాతం) మాత్రమే కొనుగోలు చేసిందని, సాధారణంగా 100 రోజుల్లో పూర్తికావాల్సిన ప్రక్రియలో ఐదో వంతు కూడా కొనకపోవడం ప్రభుత్వ ఘోర వైఫల్యమేనని చెప్పారు. సెప్టెంబరులో కర్ణాటకలో వేలం ప్రారంభమైతే వ్యాపారులు అక్కడికి వెళ్లిపోయే ప్రమాదం ఉందన్న ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతోందన్నారు.
ధర రూ.200 తగ్గకూడదని సీఎం సమీక్షలో చెప్పిన మరుసటి రోజే మార్కెట్లో ధరలు దారుణంగా పడిపోవడం శోచనీయమన్నారు. పొదిలిలో రూ.179, టంగుటూరులో రూ.184, జంగారెడ్డిగూడెంలో రూ.170, గోపాలపురంలో రూ.130 కే కొనుగోలు చేశారని, సీఎం ఆదేశాలను కూడా వ్యాపారుల సిండికేట్ ఖాతరు చేయడం లేదనడానికి ఇదే నిదర్శనమని చెప్పారు. నిబంధనలు పాటించని ఒక్క కంపెనీ లైసెన్స్ కూడా రద్దు చేయలేదని, ఏ వ్యాపారినీ బ్లాక్లిస్ట్లో పెట్టలేదని మండిపడ్డారు.
నిద్రపోతున్న ప్రభుత్వాన్ని లేపడం సులభం.. కానీ నటిస్తున్న చంద్రబాబు ప్రభుత్వాన్ని లేపాలంటే గట్టిగా ఒత్తిడి తీసుకురావాల్సిందేనన్నారు. వైసీపీ హయాంలో రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ఐదేళ్లలో పంటల కొనుగోళ్లకు రూ.7,800 కోట్లు ఖర్చు చేశామని జగన్ గుర్తుచేశారు.
ప్రస్తుత ప్రభుత్వం తక్షణమే మార్క్ఫెడ్ను కొనుగోళ్ల రంగంలోకి దించి, సిండికేట్ను అడ్డుకుని రైతులకు న్యాయం చేయాలని, లేనిపక్షంలో వైసీపీ వీధిపోరాటాలకు సిద్ధమవుతుందని హెచ్చరించారు.








