ప్రముఖ యూట్యూబర్ రమా నందన అలియాస్ ‘నందూస్ వరల్డ్’ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెపై గతంలో లుక్ఔట్ నోటీసులు జారీ కావడంతో శంషాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో (RGIA) పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అనంతరం ఆమెను ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసులకు అప్పగించనున్నారు.
యూకేలో ఉద్యోగాలు, వీసా రెన్యూవల్, స్పాన్సర్షిప్ల పేరుతో పలువురి నుంచి భారీగా డబ్బులు వసూలు చేసి మోసాలకు పాల్పడ్డారనే ఆరోపణలు నందన దంపతులపై ఉన్నాయి. ఈ వ్యవహారంలో ఇప్పటికే పలు కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే గతంలోనే వారిపై లుక్ఔట్ నోటీసులు జారీ అయ్యాయి.
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పరిధిలోని వెస్ట్ ఇబ్రహీంపట్నంకు చెందిన మామిళ్లపల్లి శివక్రాంతి కుమార్ ఫిర్యాదుతో నందన కుటుంబానికి సంబంధించిన మోసం వెలుగులోకి వచ్చినట్లు పోలీసులు పేర్కొంటున్నారు. రమా నందన అలియాస్ నందుతో పాటు మరో ఇద్దరిపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నందూస్ మామను పోలీస్ స్టేషన్కు పిలిపించి విచారించారు.
ఇదిలా ఉండగా, యూకేలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ పలువురి నుంచి భారీగా డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలు కూడా నందన దంపతులపై ఉన్నాయి. ఈ కేసులకు సంబంధించి పోలీసులు గతంలోనే లుక్ఔట్ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. తాజాగా నందన శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకోవడంతో లుక్ఔట్ నోటీసుల ఆధారంగా RGIA పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం ఆమెను ఇబ్రహీంపట్నం పోలీసులకు అప్పగించనున్నారు.








