హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన కామ్రేడ్ సారంపల్లి మల్లారెడ్డి సంస్మరణ సభలో సీఎం రేవంత్రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కమ్యూనిస్టుల పోరాటాలంటే తనకు ఎంతో అభిమానం ఉందని, రైతులు, కూలీల సమస్యల కోసం కమ్యూనిస్టులు పోరాడారని అన్నారు. అయితే ఆ సమస్యలకు పరిష్కారం చూపింది కాంగ్రెస్ పార్టీనేనని పేర్కొన్నారు. ‘‘దున్నే వాడికి భూమి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనే.. అసైన్డ్ భూములకు పట్టాలు ఇచ్చిన ఘనత కూడా కాంగ్రెస్కే దక్కుతుంది. పోరాటం కమ్యూనిస్టులది.. పరిష్కారం కాంగ్రెస్ పార్టీది’’ అని రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. వందేళ్ల కమ్యూనిస్టు చరిత్రను పరిశీలిస్తే ఎర్రజెండా అంటే ప్రజలకు నమ్మకం, పేదలకు భరోసా అని అన్నారు. మిగిలిన జెండాలను ప్రజలు పాలకుల జెండాలుగా భావిస్తారని, ఎర్రజెండా కనిపిస్తే మాత్రం భరోసా కలుగుతుందని పేర్కొన్నారు.
బీజేపీపై విమర్శలు చేసిన సీఎం.. ప్రజలతో గెలవలేని పరిస్థితుల్లో సీబీఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థలను ఉపయోగించిందని ఆరోపించారు. ఇప్పుడు ఎస్ఐఆర్ (SIR) ద్వారా తమకు వ్యతిరేకంగా ఉన్న ఓట్లను తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. మైనార్టీలతో పాటు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న ఎస్సీ, ఎస్టీల ఓట్లను కూడా తొలగిస్తున్నారని ఆరోపించిన ఆయన.. ఓట్ల తొలగింపును అడ్డుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. 2029 ఎన్నికల్లో మోదీ ఓటమికి ఇవే తొలి అడుగులని వ్యాఖ్యానించారు. కమ్యూనిస్టులు ఎన్నికల్లో గెలుస్తారా, ఓడిపోతారా అనే లెక్కలు వేయకుండా ప్రజల ఓట్లను కాపాడుకోవడంపై దృష్టి పెట్టాలని సూచించారు. కమ్యూనిస్టులు లేవనెత్తే సమస్యలకు సహేతుకమైన పరిష్కారం చూపుతానని హామీ ఇచ్చారు. సారంపల్లి మల్లారెడ్డి పేరుకు తగిన గౌరవం దక్కేలా ఏదైనా ప్రాంతానికి ఆయన పేరు పెట్టే అంశాన్ని మంత్రివర్గంలో చర్చిస్తానని సీఎం తెలిపారు.








