రాష్ట్రంలో శాంతిభద్రతలను పర్యవేక్షించాల్సిన పోలీసులకే రక్షణ కరువైందా? ‘మా ప్రభుత్వం అధికారంలో ఉంది.. మమ్మల్నే ప్రశ్నిస్తారా?’ అనే అహంకారంతో అధికార పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు ఏకంగా ఖాకీ చొక్కాలపై చేతులు వేస్తున్నారా? అంటే అవుననే అంటున్నాయి అనంతపురం జిల్లా రాయదుర్గంలో తాజాగా వెలుగుచూసిన దృశ్యాలు. విధుల్లో ఉన్న పోలీసులను ఒక టీడీపీ సోషల్ మీడియా కన్వీనర్ దారుణంగా దూషిస్తూ, కానిస్టేబుల్ చొక్కా పట్టుకుని ఈడ్చిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది.
రాయదుర్గంలో ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు తనయుడు భరత్ ఆధ్వర్యంలో క్రికెట్ ఫైనల్ మ్యాచ్ నిర్వహించారు. టోర్నమెంట్ను వీక్షించేందుకు కణేకల్లు క్రాస్కు చెందిన టీడీపీ సోషల్ మీడియా కన్వీనర్ మారుతి వచ్చాడు. స్టేడియం ఎంట్రెన్స్ వద్ద అడ్డంగా తన కారును పార్క్ చేశాడు. రాకపోకలకు ఇబ్బందిగా మారడంతో బందోబస్తులో ఉన్న హెడ్ కానిస్టేబుల్ నరేంద్ర, కానిస్టేబుల్ రాజ్కుమార్లతో పాటు మరికొందరు పోలీసులు జోక్యం చేసుకున్నారు. దారికి అడ్డంగా ఉన్న కారును పార్కింగ్ ప్లేస్లో ఉంచాలని సూచించారు.
“ప్రభుత్వం మాదిరా.. లం..కొడకల్లారా!”
కారు తీయమన్న పోలీసులపై టీడీపీ నేత ఆవేశంతో ఊగిపోయాడు. “నేనెవరో తెలుసా? ప్రభుత్వం మాదిరా! లం..కొడకల్లారా నన్నే కారు తీయమంటారా?” అంటూ అందరి ముందూ పోలీసులపై బండబూతులతో విరుచుకుపడ్డాడు. అంతటితో ఆగకుండా, విధుల్లో ఉన్న కానిస్టేబుల్ రాజ్కుమార్ చొక్కా పట్టుకుని లాగుతూ.. తన తడాఖా ఏంటో చూపిస్తా.. “ఎవరికి ఫోన్ చేసుకుంటావో చేసుకో.. ఏం పీక్కుంటావో పీక్కో” అంటూ బహిరంగంగానే దూషించాడు. అధికార పార్టీ నేత కావడంతో సదరు వ్యక్తిపై కనీస చర్యలు తీసుకునేందుకు స్థానిక పోలీసులు వెనుకాడుతున్నారనే ప్రచారం జరుగుతోంది.
హోంమంత్రి అనిత మౌనం
పబ్లిక్ లో అందరూ చూస్తుండగా పోలీస్ యూనిఫామ్పై చేయి వేసి, అసభ్య పదజాలంతో దూషించినా.. ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ఈ ఘటనపై పూర్తిగా మౌనం వహించడం గమనార్హం. ఇటీవల విజయవాడ కృష్ణలంక పీఎస్లో జరిగిన గాదె సాయికృష్ణ లాకప్డెత్ వ్యవహారంలోనూ హోంమంత్రి స్పందించలేదనే ఆరోపణలు ఉన్నాయి.
స్వయంగా అధికార పార్టీ కార్యకర్తే పోలీస్పై దాడికి దిగినా ఆమె ఎందుకు మౌనంగా ఉన్నారని పోలీస్ వర్గాలే అంతర్గతంగా చర్చించుకుంటున్నాయి. హోంమంత్రి తన శాఖను వదిలేసి, ఇతర మంత్రుల పరిధిలోని అంశాలపై ఎక్కువ మాట్లాడుతున్నారనే విమర్శలకు ఈ ఘటన మరింత బలాన్ని చేకూరుస్తోంది. మరోవైపు పోలీస్ శాఖ పనితీరుపై, లా అండ్ ఆర్డర్ వైఫల్యాలపై పవన్ కళ్యాణ్ తరచూ అసంతృప్తి వ్యక్తం చేస్తూ, తానే హోంశాఖ తీసుకుంటే పరిస్థితులు వేరుగా ఉంటాయని హెచ్చరించిన సంగతి తెలిసిందే. రాయదుర్గం ఘటన చూస్తుంటే పవన్ కళ్యాణ్ ఆందోళనలో నిజముందని సామాన్య ప్రజలు సైతం అభిప్రాయపడుతున్నారు.








‘డ్రంక్ అండ్ డ్రైవ్’.. పోలీసులకు టీడీపీ ఎంపీ వింత ప్రపోజల్ (Video)