ఏపీ (Andhra Pradesh) అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు(Raghu Rama Krishna Raju), రిటైర్డ్ డీజీ పీవీ సునీల్ కుమార్ (PV Sunil Kumar) మధ్య వివాదం మరో కొత్త మలుపు తిరిగింది. రఘురామకృష్ణంరాజుపై పెండింగ్లో ఉన్న సీబీఐ(CBI) కేసులలో సాక్షులను బెదిరిస్తున్నారంటూ, సాక్ష్యాధారాలను తారుమారు చేసే అవకాశం ఉందంటూ పీవీ సునీల్ కుమార్ సీబీఐ (CBI) డైరెక్టర్కు అత్యవసర లేఖ రాశారు.
- లేఖలోని ముఖ్యాంశాలు..
- సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (SFIO) కోరిన రికార్డులకు సంబంధించి, తనను కిడ్నాప్ చేసేందుకు రఘురామకృష్ణంరాజు ప్రయత్నించారని మాదాల శ్రీనివాస్ (Madala Srinivas) గుంటూరులోని పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారని పీవీ సునీల్ కుమార్ తన లేఖలో ప్రస్తావించారు.
- రఘురామకృష్ణంరాజు వల్ల తన ప్రాణాలకు ముప్పు ఉందని బాధితుడు మాదాల శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేసిన విషయాన్ని సీబీఐ(CBI)దృష్టికి తీసుకెళ్లారు.
- పెండింగ్లో ఉన్న సీబీఐ కేసులలో సాక్షులను బెదిరించడం, దర్యాప్తును ప్రభావితం చేయడం లక్ష్యంగా ఇలాంటి చర్యలు జరుగుతున్నాయని సునీల్ కుమార్ లేఖలో అనుమానం వ్యక్తం చేశారు.
- ఈ పరిణామాల తీవ్రతను దృష్ట్యా, కేసుల విచారణ నిష్పాక్షికంగా సాగేందుకు సీబీఐ తక్షణమే జోక్యం చేసుకుని రఘురామకృష్ణంరాజుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సునీల్ కుమార్ కోరారు.
గత కొంతకాలంగా రఘురామకృష్ణంరాజు, పీవీ సునీల్ కుమార్ మధ్య పరస్పర ఆరోపణలు, సవాళ్లు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల నమోదైన ఈ తాజా పోలీసు ఫిర్యాదును ఆధారంగా చేసుకుని, పెండింగ్ కేసుల్లో దర్యాప్తును వేగవంతం చేయాలని సునీల్ కుమార్ సీబీఐని ఆశ్రయించడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.








