తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. జీఎస్ఎల్ మెడికల్ కాలేజీలో డెర్మటాలజీ పీజీ చదువుతున్న 28 ఏళ్ల వైద్య వినద్యార్థిని డాక్టర్ ప్రియాంక కారు ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడి, అనంతరం బ్రెయిన్డెడ్ అయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళితే.. ఈనెల 3న రాజమండ్రిలోని ప్రసాదిత్యా మాల్కు సినిమా చూసేందుకు వెళ్లింది మెడికో విద్యార్థి ప్రియాంక. మాల్లో పార్కింగ్ విషయంలో ఇద్దరు యువకులతో వాగ్వాదం జరిగింది. అనంతరం స్కూటీపై మాల్ నుంచి బయటకు వస్తుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ప్రమాదంలో ఆమె రోడ్డుపై పడిపోగా, కారు ఆమె తలపై నుంచి వెళ్లినట్లు సీసీటీవీ ఫుటేజ్లో స్పష్టంగా తెలుస్తోంది.
తీవ్రంగా గాయపడిన ప్రియాంకను తొలుత స్థానిక ఆస్పత్రికి తరలించగా, అనంతరం మెరుగైన చికిత్స కోసం ఆమె తల్లిదండ్రులు హైదరాబాద్కు తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆమె బ్రెయిన్డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించినట్లు సమాచారం.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన ప్రకాష్నగర్ పోలీసులు కారును నడిపిన ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. వారు నామవరం ప్రాంతానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. మద్యం మత్తులో ఈ ఘటన జరిగినట్లుగా సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు సేకరిస్తున్న పోలీసులు ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. యువ వైద్యురాలు బ్రెయిన్డెడ్ కావడంతో కుటుంబ సభ్యులు, సహచర వైద్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.








