తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీ పేరు, ఎన్నికల గుర్తుపై ఎన్నికల సంఘం తీసుకున్న మధ్యంతర నిర్ణయాన్ని కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తప్పుబట్టారు. ఈసీ నిర్ణయం ప్రజా తీర్పును బలహీనపరిచేలా ఉందని ఆయన ఆరోపించారు. ఈ వివాదం మమతా బెనర్జీకి మాత్రమే సంబంధించినది కాదని, స్వేచ్ఛాయుత ఎన్నికలను కోరుకునే ప్రతి ఓటరుకు సంబంధించిన అంశమని పేర్కొన్నారు.
పశ్చిమ బెంగాల్లో జరగనున్న ఉపఎన్నికల నేపథ్యంలో టీఎంసీలోని మమతా బెనర్జీ, అరూప్ రాయ్ నేతృత్వంలోని రెండు వర్గాలు తమనే అసలైన పార్టీగా పేర్కొంటున్నాయి. దీంతో ఉపఎన్నికల సమయంలో రెండు వర్గాలూ టీఎంసీ పేరు, ఎన్నికల గుర్తును ఉపయోగించకూడదని ఈసీ మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. ప్రత్యామ్నాయ పార్టీ పేర్లు, ఎన్నికల గుర్తులను సూచించాలని రెండు వర్గాలను ఆదేశించింది.
ఈ నిర్ణయంపై స్పందించిన రాహుల్ గాంధీ.. గతంలో శివసేన, ఎన్సీపీ విషయంలోనూ ఇదే తరహా విధానం కనిపించిందని ఆరోపించారు. ‘‘ఓట్ల చోరీ, ప్రభుత్వం చోరీ, ఇప్పుడు పార్టీ చోరీ’’ అంటూ ఈసీపై విమర్శలు చేశారు. కాగా, రెండు వర్గాల హక్కులు, ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకునే వరకు తాత్కాలికంగా ఈ ఆదేశాలు జారీ చేసినట్లు ఎన్నికల సంఘం పేర్కొంది. తుది నిర్ణయం ఇంకా వెలువడాల్సి ఉంది.








