‘పిఠాపురం ఫైట్’.. పీక్స్‌కు చేరిన టీడీపీ-జ‌న‌సేన వార్‌

'పిఠాపురం ఫైట్'.. పీక్స్‌కు చేరిన టీడీపీ-జ‌న‌సేన వార్‌

పిఠాపురం వేదిక‌గా మొద‌లైన‌ రాజకీయ అల‌జ‌డి కూట‌మి పార్టీల మ‌ధ్య కుంప‌ట్ల‌కు దారితీస్తోంది. నిన్న‌టి ఘ‌ట‌న‌తో ఒక్క‌సారిగా రెండు పార్టీ మ‌ధ్య వైరం తారాస్థాయికి చేరుకుంటోంది. స్థానిక టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ – జనసేన నేత పెండెం దొరబాబు మధ్య మొదలైన వాగ్వాదం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర‌ చర్చకు దారితీసింది. ఇరు పార్టీల కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకోవడంతో ఈ ‘ఫైట్’ అదుపు చేయ‌లేని స్థితికి చేరుకుంటోంది.

అసలేం జరిగింది?
పిఠాపురంలో ఒక ప్రభుత్వ కార్యక్రమానికి సంబంధించిన ఫ్లెక్సీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోటో లేకపోవడాన్ని వర్మ ప్రశ్నించారు. ప్రోటోకాల్ పాటించకపోవడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేయగా, అక్కడే ఉన్న జనసేన నేత పెండెం దొరబాబు తీవ్రంగా స్పందించారు. వర్మపైకి దూసుకువెళ్లడమే కాకుండా, అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

ఈ ఘటనపై వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. గ‌తంలో రెండు చోట్ల ఓడిపోయిన వ్యక్తికి త‌న‌ స్థానాన్ని త్యాగం చేసి, గెలిపిస్తే.. ఇప్పుడు ఆ పార్టీ నాయ‌కులు త‌ననే కొట్టడానికి వస్తారా? అని ఆయన లోలోప‌ల బాధ‌ప‌డుతున్న‌ట్టుగా స‌మాచారం. “మేం పిఠాపురంలోనే పుట్టి పెరిగాం. ఎక్కడి నుంచో దత్తతకు రాలేదు. టీడీపీ బలంగా ఉంది కాబట్టే పవన్ కళ్యాణ్‌కు 80 వేల ఓట్ల మెజార్టీ ఇచ్చాం.. జనసేన నేతల తీరు టూ మచ్‌గా ఉంది. రేపటి నుంచి మా సత్తా ఏంటో చూపిస్తాం” అని ఆయ‌న నిన్న మీడియా ముఖంగా హెచ్చరిక‌లు పంపారు.

మరోవైపు, పెండెం దొరబాబు వర్గం టీడీపీ నేత‌ వర్మపై నిప్పులు చెరుగుతోంది. వర్మకు ప్రతి విషయంలోనూ ప్రోటోకాల్ రగడ చేయడం అలవాటుగా మారిందని, ఆయనలోని “చీకటి కోణాలను” త్వరలోనే బయటపెడతామని హెచ్చరించారు. కూట‌మి పొత్తు ధ‌ర్మంలో భాగంగా, సీటు త్యాగం చేసిన వ‌ర్మ‌పై ఇప్పుడు జ‌న‌సేన నాయ‌కులు తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు చేయ‌డం గ‌మ‌నార్హం.

‘వలస’ వివాదంపై జనసైనికుల కౌంటర్
పవన్ కళ్యాణ్ పిఠాపురానికి దత్తత వచ్చారన్న వ్యాఖ్యలపై జనసేన శ్రేణులు సోషల్ మీడియాలో గట్టి కౌంటర్ ఇస్తున్నాయి. “లోకేష్‌ది మంగళగిరి కాదు, బాలయ్యది హిందూపూర్ కాదు, పురందేశ్వరిది రాజమండ్రి కాదు.. ఆఖరికి చంద్రబాబు సొంత నియోజకవర్గం చంద్రగిరి, కానీ కుప్పంలో పోటీ చేయడం లేదా?” అని ప్రశ్నిస్తున్నారు. వీరందరూ వలస వచ్చిన వారు కానప్పుడు పవన్ కళ్యాణ్ మాత్రమే పిఠాపురానికి వలస వచ్చిన వ్యక్తి ఎలా అవుతారని జనసైనికులు నిలదీస్తున్నారు.

సోషల్ మీడియాలో ‘పాత వీడియోల’ వార్
ఈ వివాదం ముదరడంతో ఇరు పార్టీల సానుభూతిపరులు పాత వీడియోలను తవ్వుతున్నారు. గతంలో పెండెం దొరబాబు పవన్ కళ్యాణ్‌ను విమర్శించిన వీడియోలను టీడీపీ శ్రేణులు వైరల్ చేస్తున్నాయి. దీనికి ప్రతిగా, గతంలో చంద్రబాబును తిట్టిన ప్రస్తుత టీడీపీ మంత్రుల (మాజీ వైసీపీ నేతలు) వీడియోలను జనసేన కార్యకర్తలు బయటకు తీస్తున్నారు.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికే “వచ్చే 15 ఏళ్లు చంద్రబాబు కోసమే పని చేస్తాను” అని ప్రకటించిన నేపథ్యంలో, క్షేత్రస్థాయిలో ఇలాంటి గొడవలు కూటమికి నష్టం చేకూరుస్తాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ వివాదాన్ని ఇక్కడితో ఆపకపోతే ఇరు పార్టీల మధ్య ఉన్న సమన్వయం దెబ్బతినే ప్రమాదం ఉంది. అధిష్టానం జోక్యం చేసుకుని ఈ ‘పిఠాపురం ఫైట్’కు చెక్ పెడుతుందో లేదో వేచి చూడాలి.

Join WhatsApp

Join Now

Leave a Comment