డీఎస్సీ అవకతవకలపై వైసీపీ పోరాటాన్ని ఉధృతం చేసింది. ముఖ్యమంత్రి తనయుడు విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలనే డిమాండ్ను తీవ్రం చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా డీఎస్సీ అభ్యర్థులతో సమావేశాలను నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో గుడివాడలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో కొడాలి నాని సంచలన కామెంట్స్ చేశారు.
డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ, వాటిపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ నియామకాల్లో స్పోర్ట్స్ కోటాలో అర్హత లేని వారికి ఉద్యోగాలు ఇచ్చారని, పరీక్ష రాయని వారికీ నియామకాలు జరిగాయని ఆరోపించారు. ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు అవసరమన్నారు. అలాగే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, నిరుద్యోగ యువతకు నెలకు రూ.3,000 నిరుద్యోగ భృతి అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంపై కూడా కొడాలి నాని స్పందించారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు శంకుస్థాపన మాత్రమే చేశారని, భూసేకరణ జరగలేదన్నారు. అనంతరం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం సుమారు రూ.1,200 కోట్లు వెచ్చించి భూసేకరణ పూర్తి చేసి, అవసరమైన అనుమతులు సాధించి జీఎంఆర్ సంస్థకు ప్రాజెక్టు అప్పగించిందన్నారు.
మొత్తం క్రెడిట్ను తమదిగా కూటమి ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోందని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్న ప్రారంభోత్సవ కార్యక్రమం కోసం భారీగా ప్రజలను తరలించి ప్రభుత్వ నిధులు ఖర్చు చేశారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ప్రకటించిన “సూపర్ సిక్స్” హామీలను ప్రభుత్వం అమలు చేయలేదని కొడాలి నాని విమర్శించారు. కొత్త పెన్షన్లు ఇవ్వలేదని, మహిళలకు నెలకు రూ.1,500 ఆర్థిక సాయం, నిరుద్యోగ భృతి, గృహ నిర్మాణాలకు నిధులు వంటి హామీలు నెరవేర్చలేదని ఆరోపించారు.
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ శ్రేణులు ధైర్యంగా పోటీ చేయాలని కొడాలి నాని పిలుపునిచ్చారు. ఎలాంటి ఒత్తిళ్లకు భయపడాల్సిన అవసరం లేదని, ఎక్కడా ఏకగ్రీవాలకు అవకాశం ఇవ్వకుండా ఎన్నికల బరిలో నిలవాలని సూచించారు. అలాగే కూటమి ప్రభుత్వ విధానాలు, ఎన్నికల హామీల అమలుపై ప్రజల్లోకి వెళ్లి అవగాహన కల్పించాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు సూచించారు. రానున్న స్థానిక ఎన్నికల్లో ప్రజలు తమ తీర్పుతో ప్రభుత్వానికి సమాధానం చెబుతారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.








