స్కీమ్ల (Schemes) పేరుతో కోట్ల రూపాయలు వసూళ్ల స్కామ్ (Scam) బయటపడింది. గత నాలుగు రోజులుగా న్యాయం కోసం పోలీస్ స్టేషన్ వద్దే నిరీక్షిస్తున్నారు. కృష్ణా జిల్లా (Krishna District కంకిపాడు పోలీస్ స్టేషన్ వద్ద సత్య సాయి ఎంటర్ప్రైజెస్ (Satya Sai Enterprises) బాధితులు ఆందోళనకు దిగారు.
బాధితుల కథనం ప్రకారం.. రాజమండ్రికి (Rajahmundry) చెందిన వరద మోహన్ కృష్ణ (Varada Mohan Krishna) రాష్ట్రవ్యాప్తంగా 26 శాఖలు ఏర్పాటు చేసి వివిధ పెట్టుబడి పథకాల పేరుతో సుమారు రూ.25 కోట్ల మేర ప్రజల నుంచి డబ్బులు సేకరించి మోసానికి పాల్పడ్డారని ఆరోపించారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు నమోదైనట్లు బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మోహన్ కృష్ణ తరచూ తన చిరునామాలు మారుస్తూ (Addresses Changing) పోలీసులకు చిక్కకుండా తప్పించుకుంటున్నారని, ఇప్పటివరకు 30కిపైగా అడ్రస్లు మార్చారని బాధితులు ఆరోపించారు. ఆయన కంకిపాడులో ఉన్నట్లు సమాచారం అందడంతో అక్కడికి వెళ్లామని తెలిపారు.
మోహన్ కృష్ణతో మాట్లాడినప్పుడు రాజమండ్రికి వచ్చి సమస్యను పరిష్కరిద్దామని చెప్పాడని, అయితే మార్గమధ్యలో వాష్రూమ్కు వెళ్తానని చెప్పి పోలీసుల టోల్ఫ్రీ నంబర్కు ఫోన్ చేశాడని ఆరోపించారు. అనంతరం తమను కంకిపాడు పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి, తమలో ఆరుగురు ఏజెంట్లపై కిడ్నాప్ కేసు నమోదు చేశారని వాపోయారు.
న్యాయం కోసం వచ్చిన తమపైనే కేసులు పెట్టడం అన్యాయమని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సెల్ఫోన్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారని, తమతో వచ్చిన బంధువులపై కూడా పోలీస్ స్టేషన్లో దాడి చేశారని ఆరోపించారు. రాష్ట్రంలోని వివిధ పోలీస్ స్టేషన్లకు వెళ్లినా తమకు న్యాయం జరగలేదని, నిందితుడికి పోలీసులు సహకరిస్తున్నారనే అనుమానాలు వ్యక్తం చేశారు.
ఈ వ్యవహారంలో తమకు న్యాయం చేయాలని, లేకపోతే ఆత్మహత్యే శరణ్యమని బాధితులు హెచ్చరించారు. ఘటనపై పోలీసులు అధికారికంగా స్పందించాల్సి ఉంది.








