వరదలకు భారత్, చైనా, అమెరికాలే కారణమా? పరిహారం కోరుతున్న నేపాల్

వరదలకు భారత్, చైనా, అమెరికాలే కారణమా? పరిహారం కోరుతున్న నేపాల్

Summarize with AI

నేపాల్‌లో సంభవించిన భారీ వరదలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. ఆగస్టు 26న భోటేకోషి నదీ పరివాహక ప్రాంతంలో వచ్చిన ఆకస్మిక వరదలతో రసువా, నువాకోట్, ధాదింగ్ జిల్లాల్లో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది. ఇళ్లు, రహదారులు, వంతెనలు, జలవిద్యుత్ ప్రాజెక్టులు దెబ్బతిన్నాయి. ఈ విపత్తును నేపాల్ ప్రభుత్వం ‘హిమాలయన్ సునామీ’గా అభివర్ణించింది. ఇప్పటివరకు 1,127 మంది మరణించగా, మరో 3,900 మంది ఆచూకీ గల్లంతైనట్లు అధికారులు వెల్లడించారు. నేపాల్, చైనా సరిహద్దు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడటం, భారీ వర్షాలు వరదలకు ప్రధాన కారణాలుగా నిపుణులు భావిస్తున్నారు.

ఈ విపత్తు నేపథ్యంలో నేపాల్ ప్రభుత్వం అంతర్జాతీయ స్థాయిలో వాతావరణ న్యాయం, పరిహారం అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది. వాతావరణ మార్పులు, పెరుగుతున్న గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాల కారణంగా హిమాలయ దేశాలు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయని నేపాల్ వాదిస్తోంది. అధిక స్థాయిలో కర్బన ఉద్గారాలను విడుదల చేస్తున్న దేశాలు.. వాతావరణ మార్పుల వల్ల నష్టపోతున్న దేశాలకు పరిహారం అందించాల్సిన బాధ్యత ఉందని నేపాల్ విదేశాంగ మంత్రి శిశిర్ ఖనాల్ పేర్కొన్నారు. ఇది దాతృత్వం కాదని, చట్టపరమైన, నైతిక బాధ్యతగా చూడాలని ఆయన అంతర్జాతీయ సమాజాన్ని కోరారు. ఈ క్రమంలో చైనా, అమెరికా, భారత్ వంటి అధిక ఉద్గారాలు కలిగిన దేశాల పాత్రపై నేపాల్ దృష్టి సారించింది.

వరదల వల్ల జరిగిన నష్టం, పునరావాసం, పునర్నిర్మాణానికి అంతర్జాతీయ సహకారం కోరుతున్న నేపాల్.. ఐక్యరాజ్యసమితి మద్దతుతో పనిచేస్తున్న ‘ఫండ్ ఫర్ రెస్పాండింగ్ టు లాస్ అండ్ డ్యామేజ్’కు అధికారికంగా అభ్యర్థన కూడా పంపింది. వాతావరణ మార్పుల ప్రభావంతో తీవ్రంగా నష్టపోతున్న దేశాలకు న్యాయమైన పరిహారం అందించాలనే డిమాండ్‌ను అంతర్జాతీయ వేదికలపై బలంగా వినిపించాలని నేపాల్ భావిస్తోంది. ఈ అంశాన్ని ఐక్యరాజ్యసమితి సాధారణ సమావేశాల్లోనూ ప్రస్తావించే అవకాశం ఉంది. అయితే, వరదలకు భారత్, చైనా, అమెరికాలే ప్రత్యక్ష కారణమన్న నిర్ధారణ కంటే.. వాతావరణ మార్పులు, చారిత్రక కర్బన ఉద్గారాలు, హిమాలయ ప్రాంతాల్లో పెరుగుతున్న విపత్తుల మధ్య సంబంధాన్ని ఆధారంగా చేసుకుని నేపాల్ పరిహారం కోరుతున్నట్లు చూడాలి.

Join WhatsApp

Join Now

Leave a Comment