ఢిల్లీ వేదికగా తెలంగాణ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై చర్యలు తీసుకుంటే బీసీలు ఏకమవుతారని, కాంగ్రెస్లో అంతర్యుద్ధం తప్పదని హెచ్చరించారు. ఢిల్లీలో మీడియాతో చిట్చాట్ సందర్భంగా ఆమె కాంగ్రెస్ అధిష్ఠానం, సీఎం రేవంత్రెడ్డిపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
క్రమశిక్షణ కమిటీ నివేదిక ఢిల్లీ చేరిన అనంతరం అధిష్టానం పిలుపు మేరకు కొండా సురేఖ ఢిల్లీ వెళ్లారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను తాను కలిశానని కొండా సురేఖ తెలిపారు. తనపై వచ్చిన అంశాలపై ఖర్గేకు పూర్తి వివరణ ఇచ్చానని చెప్పారు. అయితే కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ అపాయింట్మెంట్ మాత్రం తనకు దొరకలేదని పేర్కొన్నారు.
తన కుమార్తె మాట్లాడిన అంశానికి తనను బాధ్యురాలిని చేసి చర్యలు తీసుకోవద్దని కొండా సురేఖ కోరారు. ‘‘నా బిడ్డ మాట్లాడితే నాకు ఎందుకు శిక్ష వేస్తారు? నా కూతురు మాట్లాడినందుకు నాపై చర్యలు తీసుకోవద్దు’’ అని ఆమె అన్నారు. తనపై చర్యలు తీసుకునే ముందు సీఎం రేవంత్రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కొండా సురేఖ వ్యాఖ్యానించారు. ‘‘10 ఏళ్లు తానే సీఎం అని రేవంత్ ఎలా చెప్పుకుంటున్నారు?’’ అని ప్రశ్నించారు.
కాంగ్రెస్లో మహిళలు స్వతంత్రంగా బతకాలని రాహుల్ గాంధీ చెబుతున్నారని ఆమె పేర్కొన్నారు. ఆ నేపథ్యంలో మహిళల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని అన్నారు. తనపై వచ్చిన ఆరోపణలపై చర్యల గురించి మాట్లాడుతున్న వారు.. ఇతర నేతలపై వచ్చిన ఫిర్యాదుల విషయంలో ఎందుకు స్పందించడం లేదని కొండా సురేఖ ప్రశ్నించారు.
పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, భట్టి విక్రమార్క భార్యలకు సంబంధించిన కమీషన్లపై కూడా చాలా ఫిర్యాదులు వచ్చాయని ఆమె పేర్కొన్నారు. వాటిపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. అదే విధంగా పలువురు రెడ్డి సామాజికవర్గానికి చెందిన నేతలు వివిధ అంశాలపై మాట్లాడినా వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీశారు.
కాంగ్రెస్ పార్టీలో చాలామంది మంత్రులు, నేతలు అసంతృప్తితో ఉన్నారని కొండా సురేఖ అన్నారు. పార్టీ అంతర్గతంగా నెలకొన్న పరిణామాలపై తనకు ఉన్న అభిప్రాయాలను ఢిల్లీ మీడియా చిట్చాట్లో ఆమె వెల్లడించారు. తనపై చర్యలు తీసుకుంటే బీసీలు ఏకమవుతారని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.








‘దేశం కోసం పనిచేసే చేతులు కావాలి’