దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం మే 3న నిర్వహించిన నీట్ (NEET-UG) పరీక్షను కేంద్ర ప్రభుత్వం (Central Government) అనూహ్యంగా రద్దు చేసింది(Cancelled). గత కొంతకాలంగా వినిపిస్తున్న పేపర్ లీక్(Paper Leak) ఆరోపణలు నిజమని తేలడం, పరీక్ష పారదర్శకతపై నీలినీడలు కమ్ముకోవడంతో కేంద్ర విద్యాశాఖ ఈ సంచలన నిర్ణయం తీసుకుంది.
నీట్ పరీక్షా పత్రం లీక్ అయిందన్న వార్తలు దేశవ్యాప్తంగా కలకలం రేపాయి. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ఈ పరీక్షలో అవకతవకలు జరిగాయని పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. ప్రాథమిక విచారణలో పరీక్షా పత్రాల లీకేజీ జరిగినట్లు ఆధారాలు లభించడంతో, పరీక్షను రద్దు చేసి తిరిగి నిర్వహించాలని నిర్ణయించారు.
ఈ భారీ కుంభకోణం వెనుక ఉన్న అసలు సూత్రధారులను పట్టుకోవడానికి ప్రభుత్వం ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) కి అప్పగించింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) సిఫార్సు మేరకు కేంద్ర హోం శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. పేపర్ లీకేజీ నెట్వర్క్ ఎక్కడి నుంచి ప్రారంభమైంది?, దీని వెనుక ఉన్న పెద్దల పాత్ర ఏమిటి?, అనే కోణాల్లో సీబీఐ లోతుగా దర్యాప్తు చేయనుంది.
పరీక్ష రద్దుతో పరీక్ష రాసిన లక్షలాది మంది విద్యార్థులు(Students), వారి తల్లిదండ్రులు(Parents) తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అయితే, ప్రతిభావంతులైన విద్యార్థులకు అన్యాయం జరగనివ్వబోమని, పారదర్శకమైన పద్ధతిలో అతి త్వరలోనే రీ-ఎగ్జామ్ (మళ్లీ పరీక్ష) నిర్వహిస్తామని ఎన్టీఏ వెల్లడించింది.









