వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్(YS Jagan) తన లండన్ పర్యటన ముగించుకొని ఇవాళ ఉదయం బెంగళూరుకు చేరుకున్నారు. ఆయనతో పాటు ఆయన సతీమణి వైఎస్ భారతి కూడా ఈ టూర్లో ఉన్నారు. జనవరి 14న లండన్ వెళ్లిన జగన్ దంపతులు, దాదాపు 15 రోజులు అక్కడ గడిపి ఈరోజు ఉదయం 10 గంటలకు బెంగళూరు ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు.
వైఎస్ జగన్ చిన్న కుమార్తె వర్షారెడ్డి లండన్లోని ప్రతిష్టాత్మక కింగ్స్ కాలేజ్లో చదువుతున్నారు. వర్షారెడ్డి గ్రాడ్యుయేషన్ వేడుకలో పాల్గొనేందుకు వైఎస్ జగన్ దంపతులు లండన్ వెళ్లారు. పర్యటన ముగించుకొని ఆయన తిరిగి రావడంతో బెంగళూరు ఎయిర్పోర్ట్ వద్ద వైసీపీ శ్రేణులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. జగన్ బెంగళూరు ఎయిర్పోర్టు నుంచి బయటకు వస్తున్న వీడియోలు, అభిమానులు వెల్కం చెబుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
బెంగళూరు చేరుకున్న వైఎస్ జగన్, ఫిబ్రవరి 3న తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకునే అవకాశముంది. అనంతరం పార్టీ ముఖ్యులతో సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. రాష్ట్ర రాజకీయ పరిణామాలు, పార్టీ నేతలపై కేసులు తదితర అంశాలపై ఆయన చర్చించే అవకాశముందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.








