తెలంగాణ సిద్ధాంతకర్త, ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు హరీశ్ రావు, కేటీఆర్ ఆయనకు ఘన నివాళులు అర్పించారు. నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు ప్రతీకగా నిలిచిన జయశంకర్ జీవితాంతం తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా పోరాడారని మాజీ మంత్రి హరీశ్ రావు కొనియాడారు. భవిష్యత్ తరాలకు ఆయన స్ఫూర్తిని అందించాలనే సంకల్పంతో జీవిత విశేషాలను పాఠ్యాంశాల్లో చేర్చిన ఘనత కేసీఆర్దేనని గుర్తుచేశారు. జయశంకర్ సేవలను గౌరవిస్తూ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయానికి, భూపాలపల్లి జిల్లాకు ఆయన పేరు పెట్టడంతో పాటు ప్రతి ఏటా అధికారికంగా జయంతి, వర్ధంతి కార్యక్రమాలను నిర్వహించేలా నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. జయశంకర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని పయనించడమే మనమిచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు.
మరోవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ‘ఎక్స్’ వేదికగా స్పందిస్తూ, “పుట్టుక నీది, చావు నీది, బతుకంతా తెలంగాణది” అన్నట్లుగా జయశంకర్ సార్ జీవితం సాగిందని కొనియాడారు. ఉద్యమ సారథి కేసీఆర్కు గురుతుల్యులైన జయశంకర్ ప్రజల్లో తెలంగాణ భావజాలాన్ని వ్యాప్తి చేస్తూ ఉద్యమ చైతన్యం రగిల్చిన దిక్సూచి అని అభివర్ణించారు. భూపాలపల్లి జిల్లాకు, వ్యవసాయ విశ్వవిద్యాలయానికి ఆయన పేరు నామకరణం చేసి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ మహనీయుడిని తగిన రీతిలో గౌరవించుకుందని స్మరించుకున్నారు.









బాబు పాలనలో గంజాయి పంటకే గిట్టుబాటు ధర