భారత ఎన్నికల సంఘం (EC) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియకు సంబంధించిన ముసాయిదా ఓటర్ల జాబితా విడుదలైంది. ఈ సవరణలో భాగంగా రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రక్షాళన భారీ స్థాయిలో జరిగింది. తుది రికార్డులను పరిశీలించిన అనంతరం మొత్తం ఎన్యుమరేషన్ చేసిన ఓటర్లు 3.71 కోట్లు, కాగా, 44,89,512 మంది ఓటర్ల నుంచి ఇంకా ఎన్యుమరేషన్ ఫారాలు తీసుకోలేదని ఎన్నికల అధికారులు వెల్లడించారు.
89.22 శాతం మంది ఓటర్లు ఎన్యుమరేషన్ ఫారాలు ఇచ్చినట్టు ఈసీ వెల్లడించింది. ఎన్నికల సంఘం అధికారుల పరిశీలనలో ఆంధ్రప్రదేశ్లో ఏకంగా 15.22 లక్షల మంది ఓటర్లు మృతి చెందినట్లు నిర్ధారణ అయింది. ఊరు విడిచి వెళ్లినవారు, శాశ్వతంగా వేరే ప్రాంతాలకు షిఫ్ట్ అయినవారు, విచారణ సమయంలో అందుబాటులో లేనివారు 22.30 లక్షల మంది ఉన్నారు. ఒకరికే ఒకటి కంటే ఎక్కువ ప్రాంతాల్లో నమోదు కాబడి ఉన్న దాదాపు 7.37 లక్షల డూప్లికేట్ ఓట్లను గుర్తించి తొలగించారు. 3,71,38,206 మంది ఓటర్ల ఎన్యుమరేషన్ చేసినట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది.
ఎన్నికల సంఘం ముసాయిదా జాబితాను అందుబాటులో ఉంచిన నేపథ్యంలో, ఓటర్లకు తమ పేర్లు జాబితాలో ఉన్నాయో లేదో సరిచూసుకునే అవకాశాన్ని కల్పించింది. ఎవరైనా అర్హులైన ఓటర్ల పేర్లు పొరపాటున తొలగించబడినా లేదా ఓటరు కార్డులో మార్పులు చేర్పులు ఉన్నా ఫారం-6, ఫారం-8 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. సంబంధిత బిఎల్ఒ (BLO) కార్యాలయాలు, నియోజకవర్గ కేంద్రాలు లేదా ఎన్నికల సంఘం అధికారిక వెబ్సైట్/యాప్ ద్వారా ఆన్లైన్లో కూడా తమ ఓటు స్థితిని తనిఖీ చేసుకోవచ్చు.
అందిన దరఖాస్తులపై ఎన్నికల అధికారులు క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ జరిపి, అన్ని సరిచూసుకున్న తర్వాత అక్టోబర్ 3న ఓటర్ల తుది జాబితాను విడుదల చేయనున్నారు.








