ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లలో వరుసగా చోటుచేసుకుంటున్న విషాద ఘటనలు విద్యార్థుల భద్రతపై ఆందోళన కలిగిస్తున్నాయి. సాలూరు ఘటన మరువకముందే.. తాజాగా అనంతపురం జిల్లా శెట్టూరులో ప్రభుత్వ హాస్టల్ గోడ కూలి 8వ తరగతి విద్యార్థి హర్షవర్ధన్ మృతి చెందడం కలకలం రేపింది. మరో విద్యార్థి తీవ్రంగా గాయపడటంతో ఆసుపత్రికి తరలించారు.
కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని శెట్టూరులో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రభుత్వ హాస్టల్లో ఉంటున్న 8వ తరగతి విద్యార్థులు బహిర్భూమికి వెళ్లిన సమయంలో ఒక్కసారిగా గోడ కూలింది. ఈ ఘటనలో హర్షవర్ధన్ తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. మరో విద్యార్థికి తీవ్ర గాయాలు కావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
శెట్టూరు ఘటనకు కేవలం ఆరు రోజుల ముందే మన్యం జిల్లా సాలూరులోని ప్రభుత్వ పాఠశాలలో కూడా ప్రభుత్వ పాఠశాల ప్రహరీ గోడ కూలిపోవడంతో పదో తరగతి విద్యార్థి మృతి చెందాడు.
ఒక ఘటన మరువకముందే మరో విద్యార్థి ప్రాణాలు కోల్పోవడం ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల పరిస్థితిపై తీవ్ర ప్రశ్నలు తలెత్తేలా చేస్తోంది. వరుస ఘటనలతో ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లలో చదువుతున్న విద్యార్థులు, వారి కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి.
వరుస ఘటనలతో ప్రభుత్వ హాస్టళ్లలోని విద్యార్థులు, తల్లిదండ్రుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. విద్యార్థులు ఉండే ప్రాంతాల్లో భద్రతా ప్రమాణాలను పాటించకపోవడం, ప్రమాదకరంగా ఉన్న నిర్మాణాలను ముందుగానే గుర్తించి తొలగించకపోవడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఏపీ ప్రభుత్వ పాఠశాలలో విషాద ఘటన
— Telugu Feed (@Telugufeedsite) August 17, 2026
మన్యం జిల్లాలో పాఠశాల గోడ కూలి 10వ తరగతి విద్యార్థి మృతి
సాలూరులో ప్రభుత్వ పాఠశాల ప్రహరీ కూలి విద్యార్థి అరుణ్ తేజ (15) మృతి
కొడుకు మృతితో తల్లిదండ్రులు బోరున విలపించడం చూసి అక్కడి వారు కంటతడి
బాలుడి కుటుంబీకులు, బంధువులు పెద్ద ఎత్తున… pic.twitter.com/2hXppqJDho
రాష్ట్రంలో వరుసగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం, విద్యాశాఖ తగిన స్థాయిలో స్పందించడం లేదని తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల భద్రతకు సంబంధించిన అంశాలపై తక్షణ చర్యలు తీసుకోవాల్సిన సమయంలో రాజకీయ విమర్శలు, సవాళ్లపై చూపుతున్న శ్రద్ధ విద్యాశాఖపై ఎందుకు కనిపించడం లేదనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. విద్యార్థుల ప్రాణాలు పోతున్నా కనీసం స్పందన లేకపోవడం దారుణమని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వరుస ఘటనల నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లు, ప్రహరీ గోడలు, శిథిల భవనాలను తక్షణమే తనిఖీ చేసి ప్రమాదకర నిర్మాణాలను గుర్తించాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. హర్షవర్ధన్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవడంతో పాటు, గాయపడిన విద్యార్థికి మెరుగైన వైద్యం అందించాలని కోరుతున్నారు. విద్యార్థుల ప్రాణాలకు భద్రత కల్పించడంలో ప్రభుత్వం విఫలమైతే ఇలాంటి విషాద ఘటనలు మరిన్ని చోటుచేసుకునే ప్రమాదం ఉందని తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.








