హైదరాబాద్లో(Hyderabad) 26 ఏళ్ల యువతి రోడ్డు ప్రమాదంలో(Road Accident) మృతి చెందిన ఘటనలో జనసేన ఎంపీ (Janasena MP) లింగమనేని రమేష్(Lingamaneni Ramesh) కుమారుడు సంజూష్(Sanjush) వ్యవహారం మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ప్రమాదం జరిగిన తీరుతో పాటు.. కేసు నమోదులో పోలీసులు అనుసరించిన విధానం, నిందితుడికి స్టేషన్ బెయిల్(Station Bail) వచ్చేలా సెక్షన్లు నమోదు చేశారన్న ఆరోపణలు ఇప్పుడు రాజకీయ, న్యాయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
ఆగస్టు 16న హైదరాబాద్లోని ఇనార్బిట్ మాల్ (Inorbit Mall) ఎదురుగా రోడ్డు దాటుతున్న లైఫ్స్టైల్ స్టోర్ ఉద్యోగి (Lifestyle Store Employee) భారతి ముఖి (Bharathi Mukhi) (26)ను జనసేన ఎంపీ లింగమనేని రమేష్ కుమారుడు సంజూష్ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో యువతి అక్కడికక్కడే మృతి చెందింది. అయితే ఇంత తీవ్రమైన ఘటనలో నిందితుడిని అరెస్ట్ చేయకుండా కేవలం స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేయడంపై పలు ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.
ఈ ఘటనకు సంబంధించి మాదాపూర్ పోలీసులు (Madhapur Police) బీఎన్ఎస్(BNS) 106(1) కింద కేసు నమోదు చేశారు. సాధారణంగా ఇలాంటి ప్రమాదాల్లో వర్తించే ఇతర నిబంధనలు, మోటార్ వెహికల్స్ యాక్ట్లోని (Motor Vehicles Act) సంబంధిత సెక్షన్లను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సంజూష్ రక్త నమూనాల ఫోరెన్సిక్ నివేదిక(Forensic Report) వచ్చిన తర్వాత అవసరమైన కొత్త సెక్షన్లు నమోదు చేస్తామని పోలీసులు చెబుతున్నప్పటికీ.. మొదట్లోనే కేసు నమోదు చేసిన విధానంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
తన కుమారుడిని కేసు నుంచి కాపాడేందుకు లింగమనేని రమేష్ (Lingamaneni Ramesh) పోలీసు అధికారులకు (Police Officials) భారీ ఆఫర్లు (Huge Offers) ఇచ్చారని ఆరోపణలు తెరపైకి వచ్చాయి. స్టేషన్ ఉన్నతాధికారి, లింగమనేని కుటుంబానికి చెందిన సామాజికవర్గం ఒకటే కావడంతో కేసును స్టేషన్ బెయిల్కు అనుకూలంగా ఉండే విధంగా నమోదు చేశారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.
ప్రమాదం జరిగిన రోజు నుంచే నిందితుడి కుటుంబ సభ్యులు, పోలీసు అధికారుల మధ్య వ్యవహారం సాగిందని ఓ పోలీసు ఉన్నతాధికారి పేర్కొన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ప్రమాదానికి సంబంధించిన వివరాలు ఐదు రోజుల పాటు పెద్దగా బయటకు రాలేదన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
అంతేకాకుండా సంజుష్ స్థానంలో మరో ప్రైవేట్ డ్రైవర్ను(Private Driver)చూపించి కేసును ముగించేందుకు ప్రయత్నాలు జరిగాయన్న ప్రచారం కూడా జరుగుతోంది. ప్రమాదం జరిగిన సమయంలో అక్కడున్న ఓ వ్యక్తి చిత్రీకరించిన వీడియోలు బయటకు రావడంతో వ్యవహారం వెలుగులోకి వచ్చాయి. దీంతో పోలీసులు అప్రమత్తమై మీడియాకు లీకులు ఇచ్చినట్టుగా ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.
ఘటనా స్థలాన్ని పరిశీలించిన రవాణా శాఖ అధికారులు కారు సుమారు గంటకు 80 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించినట్లు గుర్తించారు. అయితే ఘటనా స్థలంలో సీసీటీవీ కెమెరాలు అందుబాటులో లేకపోవడంతో ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలను నిర్ధారించడం కష్టమవుతోందని అధికారులు పేర్కొన్నట్లు తెలుస్తోంది.
రద్దీగా ఉండే ప్రాంతంలో సీసీటీవీ కెమెరాలు లేకపోవడంపై కూడా ప్రజల్లో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అసలు అక్కడ కెమెరాలు ఏర్పాటు చేయలేదా? లేక అందుబాటులో ఉన్న కెమెరాల ఫుటేజ్ ఎందుకు లభించలేదు? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఏపీకి (Andhra Pradesh) చెందిన రాజ్యసభ సభ్యుడు, సీఎం చంద్రబాబుకు (CM Chandrababu) అత్యంత సన్నిహితుడు లింగమనేని రమేష్ కొడుకు ప్రభావవంతమైన కుటుంబానికి చెందిన వ్యక్తి కావడంతో కేసు విషయంలో ప్రత్యేక వెసులుబాటు కల్పించారా? అన్న అనుమానాలు నిజం కాకపోతే.. దర్యాప్తు ప్రక్రియను, నమోదు చేసిన సెక్షన్లను, ఫోరెన్సిక్ నివేదికను ప్రభుత్వం పారదర్శకంగా ప్రజల ముందుంచాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.
భారతి కుటుంబానికి న్యాయం జరగాలంటే కేసును ఎలాంటి రాజకీయ, ఆర్థిక ఒత్తిళ్లకు తావులేకుండా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.








