పవిత్ర అమర్నాథ్ యాత్ర ఈ ఏడాది ఘనంగా ప్రారంభమైంది. వర్షం కురుస్తున్నప్పటికీ వేలాది మంది శివభక్తులు పహల్గామ్, బల్తాల్ బేస్ క్యాంపుల నుంచి బాబా బర్ఫానీ దర్శనం కోసం ప్రయాణం ప్రారంభించారు. తొలి రోజే 10 వేల మందికి పైగా యాత్రికులు యాత్రలో పాల్గొనగా, ఈ యాత్ర ఆగస్టు 28 వరకు కొనసాగనుంది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ అమర్నాథ్ యాత్రికులకు ప్రత్యేక లేఖ రాస్తూ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. “హర హర మహాదేవ్.. జై బాబా బర్ఫానీ” అంటూ భక్తులను అభినందించిన ఆయన, అమర్నాథ్ యాత్ర ప్రతి భక్తుడి జీవితంలో గొప్ప ఆధ్యాత్మిక అనుభవమని పేర్కొన్నారు.
భారతదేశం నలుమూలల నుంచి విభిన్న భాషలు, సంప్రదాయాలు, సంస్కృతులకు చెందిన భక్తులు ఒకే సంకల్పంతో మహాదేవుని దర్శనం కోసం రావడం దేశ ఐక్యతకు ప్రతీక అని ప్రధాని అన్నారు. యాత్రను విజయవంతంగా నిర్వహిస్తున్న శ్రీ అమర్నాథ్జీ శ్రైన్ బోర్డు, జమ్మూ-కాశ్మీర్ ప్రభుత్వం, భారత సైన్యం, భద్రతా బలగాలు, వైద్య సిబ్బంది, పారిశుధ్య కార్మికులు, సేవా సంస్థలు, అన్నదానం నిర్వహిస్తున్న వాలంటీర్ల సేవలను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. జమ్మూ-కాశ్మీర్ ప్రజలు యాత్రికులకు అందిస్తున్న ఆతిథ్యం భారతీయ సంస్కృతిలోని ‘అతిథి దేవో భవ’ భావనకు నిదర్శనమని కొనియాడారు.
ఈ సందర్భంగా ప్రతి యాత్రికుడు ఐదు సంకల్పాలు చేయాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. యాత్రలో పరిశుభ్రతను కాపాడటం, అధికారులు సూచించే భద్రతా నిబంధనలను పాటించడం, ‘వోకల్ ఫర్ లోకల్’లో భాగంగా స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించడం, రక్షాబంధన్ సందర్భంగా ఒక మొక్కను బహుమతిగా ఇవ్వడం, అలాగే ‘దేశమే ప్రథమం’ అనే భావనతో దేశాభివృద్ధికి తమ వంతు బాధ్యత నిర్వర్తించడం వంటి సంకల్పాలు తీసుకోవాలని సూచించారు. బాబా అమర్నాథ్ ఆశీస్సులు ప్రతి భక్తుడిపై ఉండాలని ఆకాంక్షించిన ప్రధాని, “మీ యాత్ర సురక్షితంగా, శుభప్రదంగా సాగాలని” హృదయపూర్వకంగా ఆకాంక్షించారు.








