పుష్కరకాలంగా తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తున్నా.. కాపులకు పార్టీలో సరైన గౌరవం, ప్రాధాన్యత ఇవ్వడం లేదని టీడీపీ మాజీ నేత, కాపు నాయకుడు గూడపాటి శ్రీనివాసరావు సంచలన కామెంట్స్ చేశారు. తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి ఇవాళ వైసీపీలో చేరిన గుంటూరు జిల్లా రేపల్లెకు చెందిన గూడపాటి శ్రీనివాసరావు.. పార్టీ మార్పునకు గల కారణాలను వెల్లడించారు. టీడీపీ, కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేశారు.
గూడపాటి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. తాను 12 సంవత్సరాల పాటు టీడీపీలో పనిచేసినా కాపు సామాజిక వర్గానికి తగిన గౌరవం, ప్రాధాన్యత లభించలేదన్నారు. ఆత్మగౌరవం, ఆత్మాభిమానం లేని చోట కొనసాగడం ఇష్టం లేకపోవడంతోనే పార్టీని వీడినట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలతో ముందుకు సాగుతోందని విమర్శించారు. ఇదే కారణంతో త్వరలోనే మరికొందరు నాయకులు కూడా టీడీపీని వీడి బయటకు వస్తారని కీలక వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలో ఎక్కడ కాపు సామాజిక వర్గానికి అన్యాయం జరిగినా వైసీపీ నేతలే అండగా నిలిచారని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉన్నప్పటికీ కాపులకు న్యాయం జరగలేదని ఆయన ఆరోపించారు. ప్రస్తుతం కూటమిలో ఉన్న కాపు నాయకులు, కార్యకర్తలలో చాలామంది వైఎస్ జగన్ నాయకత్వం వైపే ఆశగా చూస్తున్నారని చెప్పారు.
అమరావతి నిర్మాణాల విషయంలో భారీ అక్రమాలు జరుగుతున్నాయని కూడా గూడపాటి శ్రీనివాసరావు ఆరోపించారు. రాష్ట్ర రాజకీయాల్లో ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టగల నాయకత్వం వైఎస్ జగన్దేనని, రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని స్పష్టం చేశారు.








