తన ఇల్లు, ఆఫీస్పై దాడి చేయించిన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ను (Pemmasani Chandrasekhar) వదిలే ప్రసక్తే లేదని, చట్టం ముందు సంకెళ్లు వేసి నిలబెడతానని మాజీ మంత్రి, వైసీపీ(YSRCP) సీనియర్ నేత అంబటి రాంబాబు (Ambati Rambabu) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తన ఇంటిపై దాడి చేయించడంతో పాటు గుంటూరు పోలీసు వ్యవస్థను జేబులో పెట్టుకుని కక్షసాధింపు రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.
కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ను లక్ష్యంగా అంబటి రాంబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. వచ్చేది తమ ప్రభుత్వమేనని, జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) అధికారంలోకి రాగానే పెమ్మసానిని సంకెళ్లు (Handcuffs) వేసి నిలబెడతానని హెచ్చరించారు. పెమ్మసాని బయటకు పెద్దమనిషిలా కనిపిస్తూ లోపల తడిగుడ్డతో గొంతులు కోసే రకమని విమర్శించారు. నేరుగా మాట్లాడకుండా వెనుక ఉండి కక్ష సాధింపులు నడిపిస్తున్నారని ఆరోపించారు.
తలుపులు పగలగొట్టి, మహిళలు ఉన్న ఇళ్లలోకి రాత్రి వేళల్లో పోలీసులు(Police) వెళ్లి తనిఖీలు చేయడమేనా కేంద్ర మంత్రి చెప్పే అభివృద్దా అని ప్రశ్నించారు. తన నివాసంపై జరిగిన దాడి వెనుక కేంద్ర మంత్రి కుట్ర ఉందంటూ అంబటి తీవ్ర ఆరోపణలు చేశారు. నా ఇంటిపై దాడి జరిగే సమయంలో “24 గంటల్లో సినిమా చూపిస్తా” అని పెమ్మసాని ఎందుకు మాట్లాడారని ప్రశ్నించారు. తప్పు చేశారు కాబట్టే ఇప్పుడు గిల్టీగా భావించి బయటకు మాట్లాడటం లేదని ఎద్దేవా చేశారు.
“నేను నల్లపాడు పోలీస్ స్టేషన్ లాకప్లో ఉన్నప్పుడు ఇద్దరు సీఐలకు పెమ్మసాని ఫోన్ చేశాడని, అలా చేయలేదని చెబితే ఆయన కాళ్లకు దండం పెడతా” అని సవాల్ విసిరారు. గుంటూరులో హోం డిపార్ట్మెంట్ అంతా పెమ్మసాని జేబులోనే ఉందన్నారు. నా ఇంటిపై రాళ్లు, కర్రలతో దాడి చేసిన వారిలో ఒక్కరినైనా పోలీసులు ఇంతవరకు అరెస్ట్ చేశారా అని నిలదీశారు. ఈ దాడి ఘటన హోంమంత్రికి(Home Minister), పెమ్మసానికి (Pemmasani) ఎందుకు కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
సీఐడీ కేసులపై ఆగ్రహం
ఏఐ, కార్టూన్ వీడియోలతో సంకెళ్లు వేసినట్లు సోషల్ మీడియాలో పెమ్మసానిపై పోస్ట్ పెడితే తక్షణమే సీఐడీ కేసు నమోదు చేస్తున్నారని, కానీ ప్రత్యక్షంగా ఇంటిపై దాడి చేసిన వారిపై మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని అంబటి మండిపడ్డారు. పెమ్మసాని మీద తనకు వ్యక్తిగత కోపం లేదని, తన ఇంటిపై దాడి చేయించి ఆయన చూపించిన క్రూరత్వమే తనతో ఈ మాటలు మాట్లాడిస్తుందన్నారు. కడుపుమంటతోనే ఈ విషయాలు మాట్లాడుతున్నానని, చట్టాల పదునేంటో కాలమే నిర్ణయిస్తుందని తీవ్రస్థాయిలో హెచ్చరించారు.








