పేపర్ లీక్ మాఫియాకు చెక్.. నేడు లోక్‌సభలో కీలక సవరణ బిల్లు

పేపర్ లీక్ మాఫియాకు చెక్.. నేడు లోక్‌సభలో కీలక సవరణ బిల్లు

Summarize with AI

కొన్ని రోజులుగా వరుస వాయిదాలతో ప్రతిష్టంభనకు గురైన పార్లమెంట్ సమావేశాలు మంగళవారం నుంచి సజావుగా కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా చొరవతో అధికార, ప్రతిపక్ష పార్టీల ఫ్లోర్ లీడర్ల మధ్య జరిగిన చర్చలు సానుకూల ఫలితాన్నిచ్చినట్లు తెలుస్తోంది. సభ నిర్వహణకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని స్పీకర్ కోరగా, అందుకు నాయకులు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. దీంతో గత ఆరు రోజులుగా అంతరాయానికి గురైన వర్షాకాల సమావేశాలు తిరిగి గాడిలో పడే అవకాశాలు ఏర్పడ్డాయి.

ఈ నేపథ్యంలో లోక్‌సభలో నేడు ‘పబ్లిక్ పరీక్షలు (అక్రమ పద్ధతుల నివారణ) సవరణ బిల్లు-2026’పై కీలక చర్చ జరగనుంది. బిల్లుపై చర్చ కోసం ఆరు గంటల సమయాన్ని కేటాయించగా, అవసరమైతే మరింత సమయం ఇవ్వడానికి కూడా స్పీకర్ ఓం బిర్లా సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. పోటీ పరీక్షల్లో పేపర్ లీకేజీలు, కాపీయింగ్, ఇతర అక్రమాలను కట్టడి చేసి పరీక్షల నిర్వహణలో పారదర్శకత తీసుకురావడమే ఈ బిల్లుకు ప్రధాన ఉద్దేశంగా ప్రభుత్వం చెబుతోంది. విద్యార్థులకు ఇచ్చిన హామీ మేరకు ఈ బిల్లును ఉభయ సభల్లో ఆమోదింపజేసి త్వరగా అమల్లోకి తీసుకురావాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది.

మొత్తం 19 రోజుల వర్షాకాల సమావేశాల్లో ఇప్పటికే ఆరు రోజులు వాయిదాలతో వృథా కావడంతో, ఆగస్టు 13 వరకు మిగిలిన 13 సమావేశాల్లో కీలక బిల్లులను ఆమోదించేందుకు ప్రభుత్వం వేగంగా ముందుకెళ్తోంది. ఇదే సమయంలో విద్యార్థులపై జరిగిన దాడి ఘటనను ప్రస్తావిస్తూ ప్రతిపక్షాలు గత కొన్ని రోజులుగా సభలో నిరసనలు కొనసాగించాయి. ఇక ప్రతిపాదిత బిల్లులో పేపర్ లీకేజీలు, కాపీయింగ్ వంటి అక్రమాలకు పాల్పడిన వారిపై గరిష్ఠంగా 10 సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.10 కోట్ల వరకు జరిమానా విధించే కఠిన నిబంధనలు చేర్చారు. ఈ చట్టం అమల్లోకి వస్తే దేశవ్యాప్తంగా ప్రభుత్వ పరీక్షల విశ్వసనీయత, పారదర్శకత మరింత బలోపేతం అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment