కోడికి ఉన్న వాల్యూ మ‌నిషి ప్రాణానికి లేదా..? హోంమంత్రి గారూ

కోడి వాల్యూ మ‌నిషి ప్రాణానికి లేదా..? హోంమంత్రి గారూ

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కుదిపేస్తున్న గాదె సాయికృష్ణ లాకప్‌డెత్ కేసులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) సమర్పించిన రిమాండ్ రిపోర్ట్ తీవ్ర సంచలనం రేపుతోంది. సాయికృష్ణ కస్టడీలో మరణించాడని, అనంతరం ఆధారాలను మాయం చేసేందుకు ప్రయత్నాలు జరిగాయని సిట్ కోర్టుకు తెలిపినట్లు వెలుగులోకి రావడంతో ఈ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

సాయికృష్ణ‌ను సీఐ నాగ‌రాజు క‌స్టోడియ‌ల్ టార్చ‌ర్ చేసి చంపేశాడ‌ని తేలిపోయింది. రాష్ట్రంలో ఇంత జ‌రుగుతుంటే.. హోంమంత్రి అనిత ఎక్క‌డా..? అనే చ‌ర్చ జ‌రుగుతోంది. పోలీస్ శాఖ‌పై ప్ర‌జ‌ల నుంచి తీవ్ర వ్య‌తిరేక వ‌స్తున్న త‌రుణంలో ఆ శాఖ‌కు బాస్‌గా ఆమె ఎందుకు స్పందించ‌డం లేద‌ని ప్ర‌శ్నిస్తున్నారు. ప్ర‌భుత్వం ఇర‌కాటంలో ప‌డిన సంద‌ర్భాల్లో మీడియా ముందుకు వ‌చ్చి ప్ర‌తిప‌క్షాన్ని, మాజీ సీఎంను ఏక‌వ‌చ‌నంతో విమ‌ర్శించే హోంమంత్రి అనిత.. సాయికృష్ణ కేసు గురించి కూడా కాస్త స్పందిస్తే బాగుంటుంద‌ని సెటైర్లు వేస్తున్నారు.

మేకలు, కోళ్లకు ఉన్న విలువ మనిషి ప్రాణానికి లేదా?
ఈ దారుణ ఘటనపై ప్రతిపక్ష వైసీపీ ప్రభుత్వంపై, ముఖ్యంగా హోంశాఖపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. చట్టాన్ని రక్షించాల్సిన పోలీస్ అధికారే ఒక పౌరుడిని చంపేసి, శవాన్ని మాయం చేస్తే ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తోంది.

ఇటీవల మాజీ సీఎం వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు గొర్రెలు, మేకలు, ఆఖ‌రికి కోడిని కోశారనే కూడా కార‌ణం చూపి వారిని అరెస్ట్ చేసి, వారిపై థ‌ర్డ్ డిగ్రీ ప్ర‌యోగించి మ‌రీ రోడ్ల‌పై చెప్పులు లేకుండా న‌డిపించారు. మ‌రి సాయికృష్ణ అంశంపై ఎందుకు ప్రభుత్వం, డీజీపీ, ఎస్పీలు పోటీలు పడి ప్రెస్‌మీట్లు పెట్ట‌డం లేద‌ని వైసీపీ నిల‌దీస్తోంది.

“మూగజీవాలను బలిస్తారా?” అంటూ అసెంబ్లీలో సైతం ప్రస్తావించిహోంమంత్రి.. ఇప్పుడేమో ఒక తల్లికి కొడుకు ఆఖరి చూపు కూడా దక్కకుండా శవాన్ని బూడిద చేస్తే ఎందుకు స్పందించ‌డం లేదు..? కూట‌మి ప్ర‌భుత్వంలో గొర్రెలు, మేకలకు ఇచ్చే ప్రాధాన్యత మనిషి ప్రాణానికి లేదా?” అని సామాన్య ప్ర‌జ‌లు, నెటిజ‌న్లు సైతం నిల‌దీస్తున్నారు.

రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ తీవ్రంగా దెబ్బతిన్నదనడానికి ఈ కేసే ఉదాహరణని, విజయవాడ సీపీ గానీ, డీజీపీ గానీ దీనిపై సమాధానం చెప్పాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. వాహనాలు లేవనే నెపంతో గతంలో నిందితులను రోడ్డుపై నడిపించామని వ్యంగ్యంగా మాట్లాడిన ఉన్నతాధికారులు, ఇప్పుడు తమ సొంత అధికారి హైకోర్టును మోసం చేసి, సాక్ష్యాలు తగలబెడుతుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు.

ఈ కేసు కేవలం సాయికృష్ణ కుటుంబానికి మాత్రమే పరిమితమైనది కాదు, ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి పౌరుడి భద్రతకు సంబంధించినదిగా మారింది. “ఈరోజు సాయికృష్ణ.. రేపు ఎవరు? పోలీసుల కస్టడీలోకి వెళ్లిన ఒక సామాన్య పౌరుడు ప్రాణాలతో తిరిగి వస్తాడనే నమ్మకం ఏది?” అనే భయం ప్రజల్లో వ్యక్తమవుతోంది. నిజాలు ప్రభుత్వాన్ని తరుముతున్నాయని, ఇప్పటికైనా ముఖ్యమంత్రి, హోంమంత్రి ప్రజల ముందుకు వచ్చి ఈ ఘటనపై స్పష్టమైన సమాధానం చెప్పాలని విపక్షాలు, ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment