హైకోర్టులో మమతాకు షాక్.. ప్రతిపక్ష నేతగా రితబ్రత కొనసాగింపుకు గ్రీన్ సిగ్నల్!

హైకోర్టులో మమతాకు షాక్.. ప్రతిపక్ష నేతగా రితబ్రత కొనసాగింపుకు గ్రీన్ సిగ్నల్!

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి కలకత్తా హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తిరుగుబాటు ఎమ్మెల్యే రితబ్రత బెనర్జీని అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా అంగీకరిస్తూ స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని నిలిపివేయాలన్న అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. దీంతో రితబ్రత బెనర్జీ ప్రస్తుతం ప్రతిపక్ష నేతగా కొనసాగేందుకు మార్గం సుగమమైంది. జస్టిస్ కృష్ణారావు ధర్మాసనం తాత్కాలిక స్టే ఇవ్వడానికి నిరాకరించడంతో స్పీకర్ నిర్ణయం అమల్లోనే ఉంటుందని స్పష్టం చేసింది. ఈ పరిణామం బెంగాల్ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.

ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల అనంతరం టీఎంసీలో నెలకొన్న విభేదాలు ఈ వివాదానికి దారితీశాయి. పార్టీ నాయకత్వం షోవన్‌దేబ్ చటోపాధ్యాయ్‌ను శాసనసభ పక్ష నేతగా ప్రతిపాదించగా, రితబ్రత బెనర్జీ 58 మంది ఎమ్మెల్యేల మద్దతుతో ప్రతిపక్ష నేత పదవిని దక్కించుకున్నారు. అనంతరం ఆయనను పార్టీ నుంచి బహిష్కరించినప్పటికీ ఎమ్మెల్యేల మద్దతు కొనసాగింది. ఈ వ్యవహారంలో స్పీకర్ నిర్ణయంపై హైకోర్టు కొన్ని ప్రశ్నలు లేవనెత్తినా, తక్షణ జోక్యానికి నిరాకరించింది. తదుపరి విచారణను జూలై 28కు వాయిదా వేయడంతో ఇప్పుడు బెంగాల్ రాజకీయ వర్గాల దృష్టి అంతా ఆ తేదీపైనే నిలిచింది.

Join WhatsApp

Join Now

Leave a Comment