అమరావతికి సంబంధించిన సీఆర్డీఏ సమావేశంలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు. గత వైసీపీ ప్రభుత్వ కాలంలో ఏర్పాటు చేసిన ఆర్-5 (R5) జోన్ను రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు వెంటనే జారీ చేయాలని సీఎం ఆదేశించారు. ఆర్-5 జోన్ కింద కేటాయించిన మొత్తం 1402.58 ఎకరాల భూమిని తిరిగి సీఆర్డీఏ స్వాధీనం చేసుకునేలా తీర్మానం చేశారు.
50 వేల మంది పేదలకు భూములిచ్చిన వైసీపీ
గత వైసీపీ ప్రభుత్వం ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన సుమారు 50 వేల కుటుంబాలకు ఆర్-5 జోన్ పరిధిలో ఇళ్ల స్థలాలు కేటాయించింది. అయితే రాజధాని కేంద్ర ప్రాంతంలో ఇలాంటి భూ పంపిణీ వల్ల అమరావతి మాస్టర్ ప్లాన్ దెబ్బతింటుందని సీఆర్డీఏ అభిప్రాయపడింది. గతంలో చంద్రబాబు మాట్లాడుతూ.. అమరావతి ప్రాంతంలో పేద ప్రజలకు భూములు ఇస్తే డెమోక్రటిక్ ఇంబ్యాలెన్స్ (సామాజిక సమతుల్యత) దెబ్బతింటుందని మాట్లాడిన విషయం తెలిసిందే. సీఎం తాను నమ్మిన విధానానికి కట్టుబడే రాజధాని ప్రాంతంలో పేదలు ఉండకూడదని 50 వేల మందికి జగన్ ఇచ్చిన పట్టాలను రద్దు చేసినట్టుగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
లబ్ధిదారులకు ప్రత్యామ్నాయ భూములు
ఇప్పటికే ఇళ్ల పట్టాలు పొందిన లబ్ధిదారుల విషయంలో ప్రభుత్వం సానుకూల వైఖరి ప్రకటించింది. రాజధాని ప్రాంతంలో కాకుండా, ఆయా జిల్లాల్లో ఖాళీ ప్రదేశాలను చూసి పరిశీలన తరువాత అధ్యాయనం చేసి ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తామని ప్రకటించింది. అసెంబ్లీ, హైకోర్టు భవనాల ఎంఈపీ (MEP) పనులకు టెండర్లు పిలవడానికి సీఆర్డీఏ ఆమోదం తెలిపింది. అలాగే అమరావతిలో కొత్తగా 7 సంస్థలకు భూములు కేటాయింపులు చేయాలని నిర్ణయించింది. బీజేపీ కార్యాలయానికి 1.43 ఎకరాలను కేటాయించారు.
బ్యాంకులకు స్థలాలు – మున్సిపల్ మంత్రి ప్రకటన
అమరావతిలో బ్యాంకింగ్ సేవల కోసం పలు ప్రముఖ బ్యాంకులకు స్థలాలు కేటాయించనున్నట్లు మున్సిపల్ శాఖ మంత్రి పొన్నూరు నారాయణ తెలిపారు. అమరావతి భూములకు సంబంధించిన రెవెన్యూ బకాయిల అంశంపై కూడా ప్రభుత్వం దృష్టి సారించింది. అవసరమైన ప్రక్రియలు పూర్తి చేసి భూములను తిరిగి సీఆర్డీఏ పరిధిలోకి తీసుకురావాలని నిర్ణయించింది.








