పులివెందులలోని భూమయ్యపేటలో నూతనంగా నిర్మించిన గట్టు శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రారంభోత్సవానికి వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ పురాతన ఆలయాభివృద్ధికి, పునర్నిర్మాణానికి భారీగా నిధులను మంజూరు చేసిన సంగతి తెలిసిందే. నిర్మాణ పనులు పూర్తిచేసుకున్న అనంతనం నేడు ఆలయాన్ని వైభవంగా ప్రారంభించారు.
గట్టు శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రాంగణానికి చేరుకున్న వైఎస్ జగన్కు ఆలయ అర్చకులు, వైదిక కమిటీ సభ్యులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయ పునఃప్రతిష్ఠా కార్యక్రమాల్లో భాగంగా నిర్వహించిన ప్రత్యేక కలశ శంకుస్థాపన పూజల్లో వైఎస్ జగన్ పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణంలో అర్చకులు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించిన సుదర్శన హోమంలో పాల్గొని, పూర్ణాహుతి సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ.. గట్టు శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి దివ్య ఆశీస్సులు, దీవెనలు రాష్ట్ర ప్రజలందరికీ, భక్తులకు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. లక్ష్మీనరసింహుని కృపతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని స్వామివారిని ప్రార్థించినట్లు పేర్కొన్నారు.
ఓబుళరెడ్డి శ్రీరామిరెడ్డి కుటుంబానికి పరామర్శ
ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమం ముగించుకున్న అనంతరం వైఎస్ జగన్ నేరుగా వైసీపీ సీనియర్ నాయకుడు, దివంగత ఓబుళరెడ్డి శ్రీరామిరెడ్డి నివాసానికి వెళ్లారు. ఇటీవల అనారోగ్య సమస్యలతో శ్రీరామిరెడ్డి మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యులను వైఎస్ జగన్ పరామర్శించారు. శ్రీరామిరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన వైఎస్ జగన్, ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.








