131వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్సభలో వీగిపోవడంపై మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం ప్రతిపాదించిన 50 శాతం సీట్ల పెంపుదలకు మద్దతు ఇచ్చి ఉంటే దక్షిణాది రాష్ట్రాలకు భారీగా లబ్ధి చేకూరేదని, కానీ విపక్షాల చర్యల వల్ల మహిళా రిజర్వేషన్లతో పాటు దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలు దెబ్బతిన్నాయని ఆయన పేర్కొన్నారు.
ఏ రాష్ట్రానికి ఎంత నష్టం? జగన్ లెక్కలివే..
కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ’50 శాతం సీట్ల పెంపుదల’ విధానానికి, 2011 జనాభా లెక్కల ఆధారిత పునర్విభజనకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని జగన్ గణాంకాలతో వివరించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి
| రాష్ట్రం | ప్రస్తుత సీట్లు | 50% పెంపుదల ఉంటే.. | 2011 లెక్కల ప్రకారం.. | నష్టం |
| ఆంధ్రప్రదేశ్ | 25 | 38 | 34 | 04 |
| తెలంగాణ | 17 | 26 | 24 | 02 |
| కేరళ | 20 | 30 | 23 | 07 |
| తమిళనాడు | 39 | 59 | 50 | 09 |
| కర్ణాటక | 28 | 42 | 42 | 00 |
జగన్ లేవనెత్తిన ప్రధానాంశాలు
ప్రస్తుతం దేశంలో దక్షిణాది రాష్ట్రాల వాటా 23.76% గా ఉంది. 50 శాతం పెంపుదల అమలైతే ఇది 23.87% కి పెరిగేది. కానీ 2011 లెక్కల ప్రకారం వెళ్తే ఇది 20.44% కి పడిపోతుంది. కుటుంబ నియంత్రణను సమర్థంగా అమలు చేసినందుకు దక్షిణాది రాష్ట్రాలు శిక్ష అనుభవించాల్సి వస్తోందని జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. 2026 జనాభా లెక్కలు పరిగణనలోకి తీసుకుంటే పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని హెచ్చరించారు.
బిల్లును అడ్డుకున్న పార్టీలు తాము ఏం సాధించామో ఆలోచించుకోవాలని, రాజకీయ ప్రయోజనాల కోసం మహిళా రిజర్వేషన్లను, దక్షిణాది హక్కులను బలి ఇచ్చారని విమర్శించారు. “జనాభా లెక్కలతో నిమిత్తం లేకుండా సీట్లను పెంచడమే దక్షిణాదికి శ్రీరామరక్ష. అది వదులుకోవడం వల్ల ఇప్పుడు మహిళలకు న్యాయం జరగలేదు, రాష్ట్రాలకూ ప్రయోజనం చేకూరలేదు” అని జగన్ తన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పష్టం చేశారు.
Opposing parties should seriously question themselves; what have they achieved ?
— YS Jagan Mohan Reddy (@ysjagan) April 17, 2026
While the reality is that the numbers would come down for the south and women reservation bill has been postponed ! Justice is rendered neither to the south nor the women! If 2026 census were to… pic.twitter.com/RgRYPR42gx








